సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యంతో ఊహించని అభివృద్ధి
రాష్ర్టానికే మోడల్గా గజ్వేల్ సెగ్మెంట్
ఆదర్శ బల్దియాగా పాలకవర్గం తీర్చిదిద్దాలి
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు
స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం
యూజీడీ పూర్తయిన తర్వాత రోడ్ల నిర్మాణం
గజ్వేల్లో మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్
పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రులు
గజ్వేల్, జూన్13: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని, కలలో ఊహించని అభివృద్ధి ఇక్కడ జరుగుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గజ్వేల్లో సీఎం కేసీఆర్ కాలు పెట్టగానే ఎంతో మార్పు వచ్చిందన్నారు. గజ్వేల్లో జరిగిన అభివృద్ధి రాష్ర్టానికి ఆదర్శంగా, మార్గదర్శనంగా మారిందన్నారు. గెలిచిన ఏడాదిలో నీళ్లు తేకుంటే రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పారని, దశాబ్దాలుగా తాగునీటికి గోసపడ్డ గజ్వేల్ నియోజకవర్గానికి పట్టుదలతో మిషన్ భగీరథతో నీటిని తెచ్చారన్నారు. గజ్వేల్ వెజ్,నాన్వెజ్ సమీకృత మార్కెట్, మున్సిపల్ భవనం రాష్ర్టానికి మోడల్గా నిలిచాయని, కార్పొరేట్ స్థాయిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వీటిని నిర్మించారన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో రాష్ర్టానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ తీర్చిదిదదారన్నారు. గజ్వేల్లో రూ.100కోట్లతో నిర్మిస్తున్న యూజీడీ పనులు పూర్తవ్వగానే, మరో 5నెలల్లో అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతామన్నారు.
మరో 20ఏండ్లు పాలించేలా ఆశీర్వదించండి : మంత్రి శ్రీనివాస్గౌడ్
సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు రాష్ర్టాన్ని, బడుగు,బలహీన వర్గాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని, రాష్ర్టాన్ని మరో 20ఏండ్లు పాలించేలా సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గజ్వేల్లో మంత్రి హరీశ్రావుతో కలిసి ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో నాటుసారా లేకుండా పోయిందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో గీత కార్మికులు గౌరవంగా బతుకుతున్నారన్నారు. ఈత,తాటి చెట్లపై పన్ను మినహాయించడంతో పాటు వృత్తిలో మృతిచెందిన గీత కార్మికులకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గుడుంబా నిషేధానికి ఎక్సైజ్ అధికారుల కృషి అమోఘమని, సీఎం కేసీఆర్ కృషితోనే ఎక్సైజ్ శాఖకు అధునాతన కార్యాలయ భవనాలను సాకారమైనట్లు తెలిపారు. మంత్రి హరీశ్రావు సూచనల మేరకు త్వరలో సిద్దిపేటలో నీరా స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
సీఎంగా కృషితోనే గజ్వేల్కు షాదీఖానా, మైనార్టీ గురుకులాలు
సీఎంగా కేసీఆర్ కృషితోనే గజ్వేల్లో షాదీఖానా నిర్మాణం జరిగిందని మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి అన్నారు. షాదీఖానను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో విజయరామారావు ఎమ్మెల్యేగా ఉన్న నాటి నుంచే మైనార్టీలు షాదీఖానా, షాపింగ్ కాంప్లెక్స్ల కో సం ప్రయతిస్తున్నా అది సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్తో ఆ కల సాకారమైందన్నారు. అన్నివర్గాలను సమానంగా చూడడమే సీఎం కేసీఆర్ గొప్పతనమన్నారు. షాదీముబారక్తో ఎంతోమందికి భరోసా కల్పించారన్నారు.
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు..
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్లో 1250 డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదల కోసం నిర్మించామని మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి 6వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కౌన్సిలర్ బబ్బూరి రజిత ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఈనెల 20వ తేదీ వరకు వారం పాటు అన్ని వార్డుల్లో ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని, బ్రోకర్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని మంత్రి, ఎంపీ సూచించారు. ప్రస్తుతం నిర్మించిన ఇండ్లు అందరికీ సరిపోతాయని, ఒకవేళ అవసరమైతే మరో 100 ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.
ఆర్యవైశ్యులకు అన్నిరంగాల్లో సముచిత స్థానం
ఆర్యవైశ్యులకు అన్నిరంగాల్లో సీఎం కేసీఆర్ సముచిత గౌరవాన్ని కల్పిస్తున్నారని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గజ్వేల్లో ఆర్యవైశ్య భవన్ నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్గా ఎన్సీ రాజమౌళిని నియమించడమే కాకుండా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు ఊహించని విధంగా గజ్వేల్ లో ఆర్యవైశ్య భవనాన్ని ప్రభుత్వమే నిర్మించడం ఎంతో గొప్పవిషయమన్నారు.
రోడ్డు నిర్మాణంతో క్యాసారం మరింత అభివృద్ధి
గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని క్యాసా రం గ్రామం రోడ్డు నిర్మాణంతో మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి హరీశ్రావు అన్నారు. రూ. 10.75కోట్లతో నిర్మించనున్న గజ్వేల్ – క్యాసారం రోడ్డు నిర్మాణానికి ఆదివారం మంత్రి భూమిపూజ చేశారు. క్యాసారం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని కౌన్సిలర్ బాలమణి శ్రీనివాస్రెడ్డికి మంత్రి హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు
గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పాలకవర్గం, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావుకు జ్ఞాపికగా వీణను మున్సిపల్ చైర్మన్ రాజమౌళి బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ పట్టణాభివృద్ధికి కృషిచేస్తామన్నారు.
ఆకట్టుకున్న అభివృద్ధి జాతర వీడియోసాంగ్
సీఎం కేసీఆర్ గజ్వేల్కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత గజ్వేల్ పట్టణాభివృద్ధిని వివరిస్తూ చిత్రించిన ‘గజ్వేల్లో అభివృద్ధి జాతర’ అనే వీడియోసాంగ్ను మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు. గజ్వేల్లో జరిగిన అభివృద్ధికి పూర్తిస్థాయిలో అద్భుతంగా ఈ వీడియోలో చూపారని మంత్రి అభినందించారు. మున్సిపల్ భవన ప్రాంగణంలో గతంలోని గజ్వేల్, అభివృద్ధి చెందిన గజ్వేల్, భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి పనులతో కూడిన చిత్రమాలికతో మంత్రి హరీశ్రావుకు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వివరించారు. భవన ప్రారంభానికి ముందు కార్యాలయ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు.ఈ కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త్తా, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జనయొద్ద్దీన్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, ఆర్డీవో విజయేందర్రెడ్డి, తహసీల్దార్ అన్వర్, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్,ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈఎస్ రజాక్, గాయత్రి, విజయభాస్కర్ రెడ్డి,ఎక్సైజ్ సీఐ ప్రభావతి, కౌన్సిలర్లు, మాజీ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండమధు, నాయకులు, కా ర్యకర్తలు, పాల్గొన్నారు.