తూప్రాన్ రూరల్, మే 12 : తూప్రాన్ పట్టణ శివారులోని ఎన్హెచ్ 44వ జాతీయ రహదారిపై రూ.32.25 కోట్లతో నిర్మిస్తున్న అండర్పాస్ వంతెన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ఫ్లై ఓవర్ తరహాలో దీనిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తయితే రోడ్డు ప్రమాదాలకు చెక్ పడనున్నది. ప్రతిరోజూ జంటనగరాల నుంచి నిజామాబాద్, భైంసా, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, బోధన్, మహారాష్ట్రలోని నాందేడ్ తదితర ప్రాంతాలకు.. అటువైపు నుంచి జంట నగరాలకు వేలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు వెల్దుర్తి, శివ్వంపేట మండలాలకు వెళ్లాలన్నా.. అటు నుంచి తూప్రాన్, వర్గల్, గజ్వేల్ తదితర మండలాలకు ప్రయాణికులు ఈ క్రాస్ రోడ్డును దాటాల్సిందే.. దీంతో జాతీయరహదారిపై ఉన్న నాగులపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతుండగా, మరి కొంత మంది క్షతగాత్రులవుతూ దవాఖానల్లో చేరుతున్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో…
తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి రెండేండ్ల క్రితం స్థానికులు ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదాల నుంచి విముక్తి చేయాలంటూ వేడుకున్నారు. స్పందించిన ఎంపీ నేషనల్ హైవే అథారిటీ(ఎన్హెచ్ఏఐ) అధికారులతో చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నాగులపల్లి క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం రూ.32.25 కోట్లు మంజూరు చేయించారు. నాగులపల్లి క్రాస్ రోడ్డు మీదుగా తూప్రాన్కు వచ్చే శివ్వంపేట, వెల్దుర్తి మండలాల ప్రయాణికులు అండర్పాస్ బ్రిడ్జి నుంచి చేరుకోవడానికి మార్గం సులభతరం చేయాలని, తూప్రాన్ నుంచి శివ్వంపేట, వెల్దుర్తి మండలాలకు వెళ్లే ప్రయాణికులు ఈ బ్రిడ్జినే వాడుకోవాల్సి ఉంటుందని నిర్ణయించి నిర్మాణ పనులను ముమ్మరం చేశారు.
నిర్మాణ పూర్తయితే భారీ వాహనాలు రాకపోకలు…
నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే జంటనగరాల నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు, అటువైపు నుంచి జంటనగరాకు వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై నిర్మిస్తున అండర్పాస్ వంతెన పైనుంచే నేరుగా వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు చోటుకు అవకాశాలు ఉండవు.
వంతెన పక్కన రెండు వేర్వేరు రోడ్లు
నాగులపల్లి వద్ద నిర్మిస్తున్న అండర్పాస్ వంతె న పక్కన రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు పొడవు నా రెండు వేర్వేరు రోడ్లను నిర్మిస్తున్నారు. జంటనగరా ల నుంచి ఇతర జిల్లాలకు నేరుగా జాతీయ రహదారిపై నుంచే ప్రయాణించవచ్చు. చేగుంట వైపు నుంచి తూప్రాన్కు రావాలనుకునే ప్రయాణికులు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి శివ్వంపేట, వెల్దుర్తి మండలాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు అండర్పాస్ బ్రిడ్జి పక్కన నిర్మిస్తున్న రోడ్ల నుంచి వెళ్లేలా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు
నాగులపల్లి క్రాస్రోడ్డు వద్ద ప్రమాదాలు జరుగుతున్నా యన్న విషయాన్ని ఎంపీ గుర్తించి, తక్షణమే ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి అండర్పాస్ వంతెన నిర్మాణానికి రూ.32.25 కోట్లు విడుదల చేయించారు. నిర్మాణ పనులు పూర్తయితే రోడ్డు ప్రమాదాలు జరుగవు.
త్వరలోనే పూర్తవుతాయి
ఎంపీ ఆదేశాలతో అండర్పాస్ వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తున్నాం. మరో నెలలో పనులు పూర్తవుతాయి. నగరంలోని ఫ్లై ఓవర్ వంతెన తరహాలో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.