సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడం వల్ల బ్లాక్ఫంగస్ కేసులు కూడా తగ్గుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మొన్నటి వరకు గాంధీ, కోఠి ఈఎన్టీ దవాఖానల్లో ప్రతిరోజూ 40 నుంచి 60 వరకు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవగా, కొన్ని రోజుల నుంచి ఈ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. 15 రోజుల క్రితం వరకు గాంధీలో 300కు పైగా, ఈఎన్టీలో 200కు పైగా మ్యుకోర్మైకోసిస్ ఐపీ రోగులు చికిత్స పొందేవారు. ఇప్పుడా సంఖ్య దాదాపుగా తగ్గుముఖం పట్టి సోమవారం నాటికి గాంధీలో 179 ఐపీ కేసులు, ఈఎన్టీలో 67 కేసులకు పడిపోయాయి. మరో పది పదిహేను రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఈఎన్టీలో బ్లాక్ఫంగస్ కేసులు తగ్గడంతో సాధారణ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. గాంధీలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 394 ఉంది. ఈ సంఖ్య వందలోపు తగ్గితే అక్కడ కూడా నాన్కొవిడ్ సేవలను ప్రారంభించే అవకాశాలున్నట్లు గాంధీ వర్గాలు తెలిపారు.