మెదక్ అర్బన్, జూలై 11 : చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడి కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోక్సో కోర్టును ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా పరిపాలన న్యాయమూర్తి టి.అమర్నాథ్గౌడ్ ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో పోక్సో కోర్టు న్యాయమూర్తిగా మైత్రేయి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డితో కలిసి పోక్సో కోర్టుకు సంబంధించిన గదులను ప్రారంభించారు. ముందు గా హైకోర్టు న్యాయమూర్తి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ… పోక్సో చట్టంపై న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని, దీనిపై వర్క్షాప్ ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. పోక్సో చట్టం ప్రధాన ఉద్దేశం లైంగిక నేరాల నుంచి బాలలను కాపాడడం, వారికి రక్షణ, సత్వర న్యాయం కల్పించడమన్నారు. ఇందుకు 2012లో బాలల రక్షణ చట్టం తెచ్చారని వివరించారు. 18 ఏండ్ల లోపు బాలబాలికలపై లైంగిక నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించడానికి పోక్సో చట్టం ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. లైంగిక వేధింపులు, లైంగిక దాడులు రెండు ప్రధాన నేరాలని, ఆయా నేరాల్లో కేసు తీవ్రత పరిగణలోకి తీసుకుని నిందితులకు జైలుశిక్ష, జీవిత ఖైదు, జరిమానా విధించాలన్నారు. పోక్సో చట్టాన్ని పకడ్బందీగా అమలుపర్చడానికి రాష్ట్రస్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యవేక్షిస్తున్నది.
బాధిత బాలలకు భద్రతతోపాటు వైద్యసేవలు, పునరావాసం అంశాలపై కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం మెదక్ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి, కార్య దర్శులు సంతోష్రెడ్డి, జనార్దన్రెడ్డి, పోచయ్యతోపాటు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల బార్ అసోసియేషన్ల సభ్యులు సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి, పోక్సో కోర్టు న్యాయమూర్తి మైత్రేయి, కలెక్టర్ హరీశ్, ఎస్పీ చందనదీప్తి, సివిల్ న్యాయమూర్తులు సుహాసిని, లావణ్య, స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ సాయికిరణ్, మెదక్ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు జనార్దన్రెడ్డి, పోచయ్య, ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.