ప్రభుత్వం పది రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు ముగిశాయి. ప్రతీ అడుగూ ప్రగతి పథమై సాగింది. ఈ కార్యక్రమాల్లో అనేక సమస్యలు కొలిక్కి వచ్చాయి. విద్యుత్, పారిశుధ్యం తదితర కష్టాలు దూరమయ్యాయి. అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యాయి. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కాగా, వందశాతం విజయం సాధించారు. వార్డుల అభివృద్ధికి నివేదికల మేరకు కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలతో పల్లె, పట్టణాలు కొత్త రూపును సంతరించుకున్నాయి.
గజ్వేల్,జూలై10: పట్టణ ప్రగతిలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సమస్యలను చాలా వరకు పరిష్కరించుకున్నామని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని పదో వార్డులో పట్టణప్రగతి, హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన పట్టణ ప్రగతితో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చాలా సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం, తాగునీరు తదితర అన్ని సమస్యలను ఆయా వార్డు సభ్యులు, అధికారులు, నాయకుల సమన్వయంతో పరిష్కరించామన్నారు. పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని వార్డు సభ్యులందరూ గుర్తించాలన్నారు. హరితహారంలో భాగంగా గజ్వేల్ పట్టణాన్ని చెట్లతో అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ఇంటికి ఆరు మొక్కలను అందిస్తున్నామని, ప్రజలంతా వాటిని పెరట్లోనాటి ఏపుగా ఎదిగేలా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, వైస్ చైర్మన్ జకియోద్దీన్, కౌన్సిలర్లు రహీం, ఉప్పలమెట్టయ్య, చందన, నాయకులు మల్లేశం, గుంటుకురాజు, శ్రీధర్, రవి తదితరులు పాల్గొన్నారు. కాగా 18వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, 9వ వార్డులో మామిడి సంధ్యారాణి శ్రీధర్, 17వ వార్డులో లక్ష్మికిషన్రెడ్డి, 8వ వార్డులో వైస్ చైర్మన్ జకియోద్దీన్ మొక్కలను పంపిణీ చేశారు. 20వ వార్డులో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో గత పట్టణ ప్రగతిలో ఇచ్చిన మొక్కలను బాగా పెంచిన వారికి సన్మానం చేశారు.
జేపీ తండాలో పల్లె ప్రగతి పనులు
నంగునూరు, జూలై 10 : నంగునూరు మండలం జేపీ తండాలో పల్లె ప్రగతిలో భాగంగా 10వ రోజు ముగింపు సభ నిర్వహించారు. పది రోజుల నివేదిక చదివి సభలో ఆమోదం పొందారు. డంపింగ్యార్డు, వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతివనాన్ని జిల్లా సివిల్ సైప్లె అధికారి హరీశ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గ్రామ ప్రత్యేకాధికారి నాగేశ్వర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. మంత్రి హరీశ్రావు, అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని సర్పంచు భిక్షపతినాయక్ తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి, ఉప సర్పం చు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన నాచగిరిక్షేత్ర పాలకమండలి సభ్యులు
వర్గల్, జూలై 10:నాల్గో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం నాచగరి క్షేత్ర పాలకమండలి సభ్యులు మొక్కలు నాటారు. సుదూర ప్రాంతాల నుంచి నిత్యం భక్తు లు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివస్తుంటారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కల పెంప కం ద్వారా భక్తులకు చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన పరిస్థితులను కల్పించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శభ్నవీసు హనుమంతారావు అన్నారు.కార్యక్రమంలో పాలకమండలి స భ్యులు నంగునూరి సత్యనారాయణగుప్తా, లచ్చగౌని రాములుగౌడ్, పడిగె రాజు, చంద్రారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్గౌడ్, సిబ్బంది పాండు, నరేందర్ పాల్గొన్నారు.
బంజేరుపల్లిలో…
నారాయణరావుపేట, జూలై 10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ‘సుడా’ చైర్మన్ రవీందర్రెడ్డి అన్నారు. నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ బాలకృష్ణ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం 10 రోజులుగా నిర్వహించినందున గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హరితహారంలో ఇండ్ల ముందు మొక్కలు నాటాలన్నారు. పల్లె ప్రగతిలో ఏమైన పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచు శంకర్, ఏపీఎం ధర్మసాగర్, పంచాయతీ కార్యదర్శి శ్వేత, ప్రజలు పాల్గొన్నారు.
సిద్దిపేట, జూలై 10 : సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 44 వార్డుల్లో పది రోజులపాటు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అనేక సమస్యలను పరిష్కరించుకున్నామని మున్సిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డులోనూ 4 కమిటీలను వేసి మంత్రి హరీశ్రావు ఆదేశానుసారం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా 545.28 మెట్రిక్ టన్నుల చెత్తను, 855.9 టన్నుల డెబ్రిస్ను, 156 కి.మీ మేర రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదలను, 146.8 కి.మీ మేర డ్రైనేజీల్లో పూడిక తొలగించామన్నారు. శిథిలావస్థలో ఉన్న 61 ఇండ్లను కూల్చివేశామన్నారు. మొత్తం 59,254 మొక్కలను నాటామన్నారు. రోడ్డు మధ్యలో 6 వేల మొక్కలను నాటడంతో పాటు రోడ్లకు ఇరువైపులా 21 కి.మీ పొడవు మొక్కలు నాటామన్నారు. 37,404 మొక్కలను పంపిణీ చేశామన్నారు. మంచిగా మొక్కలు పెంచిన 73 మంది దంపతులను సన్మానించామన్నారు. కొత్తగా కుశాల్నగర్లో 2 కోట్లతో వైకుంఠధామ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. 25 దళిత బస్తీలను సందర్శించి వారి సమస్యలను గుర్తించామన్నారు.