మెదక్ మున్సిపాలిటీ, జూన్ 10: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధ్దంగా ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా ఈ నెల 2న ప్రారంభం కావాల్సిన నూతన విద్యా సంవత్సరం ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందేవారితో పాటు ప్రస్తుతం చదువుతున్న వారికి బడులు ప్రారంభం కాగానే పాఠ్యపుస్తకాలు అందజేయనున్నారు. మెదక్ జిల్లాకు అవసరమైన పుస్తకాలు గోదాముకు చేరుకున్నాయి. వాటిని త్వరలోనే మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు తరలించనున్నారు.
పాఠశాలల వివరాలు..
మెదక్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 923 ఉన్నాయి. కేజీబీవీలు 15, ఆదర్శ పాఠశాలలు 7, బీసీ వెల్ఫేర్ (జ్యోతిబాపూలే) 7, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 4, ట్రైబల్ వెల్ఫేర్ 5, మినీ గురుకులాలు 2, మైనార్టీ గురుకుల పాఠశాలలు 2, ఆశ్రమ పాఠశాలలు 2 ఉన్నాయి. ఈ బడులకు విద్యాశాఖ నేరుగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నది. వీటిలో చదివే విద్యార్థులకు యూడైస్ వివరాల ప్రకారం 4.60 లక్షల పుస్తకాలు అవసరమని విద్యాశాఖ నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు జిల్లాకు 2,77,650 పుస్తకాలు (60శాతం) జిల్లా గోదాముకు చేరాయి. మిగతా 1,82,350 పుస్తకాలు రావాల్సి ఉన్నది.
ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్…
ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని పాఠాలను క్యూఆర్ కోడ్ ద్వారా వీక్షించి సులభంగా అర్థం చేసుకునేలా తయారు చేశారు. ప్రతి పుస్తకంపై అందులోని అన్ని పాఠాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. సెల్ఫోన్ ద్వారా కోడ్ స్కాన్ చేస్తే విద్యార్థులకు ఆ పాఠ్యాంశాన్ని దృశ్య రూపకంగా చూడవచ్చు. ఈ పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రత్యేక నంబర్లను సైతం ముద్రించారు. వీటి ఆధారంగా పాఠశాలలకు తరలించిన పుస్తకాల వివరాలను రికార్డుల్లో నిక్షిప్తం చేయనున్నారు.