మెదక్ మున్సిపాలిటీ, జూన్ 10 : ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. జూనియర్ కళాశాలలను బలోపేతం చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే కావడంతో అన్ని వసతులు కల్పిస్తున్నది. అధ్యాపకులు బోధనతో పాటు ఎంపీసీ విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు, బైపీసీ విద్యార్థులకు నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన సాధారణ విద్యార్థులు అనేక మంది ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రభుత్వ కళాశాలల సత్తా చాటుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ప్రభు త్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
దరఖాస్తు ఇలా..
ఇంటర్మీడియట్ బోర్డు ఆన్లైన్ ద్వారా ఇంటర్ ప్రథమ సంవత్స కోర్సులో చేరేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్లో లాగిన్ అనంతరం జిల్లాలోని తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. మే 25 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ ప్రక్రియ వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రవేశాలు పొందేందుకు గడువు ఉంది. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు కస్తూర్బా, మోడల్, టీఎస్ గురుకుల, మైనార్టీ కళాశాలలు కలిపి 40 వరకు ఉండగా, వీటిలో జనరల్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సులో విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు.
జిల్లాలో 6,160 సీట్లు
మెదక్ జిల్లాలో 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉం డగా, ఇందులో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ సెక్టర్ కస్తూర్బా, మోడల్, టీఎస్ గురుకుల, మైనార్టీ కళాశాలలు 24 ఉన్నాయి. వీటిలో మొత్తం 6,160 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీలో 704, బైపీసీలో 704, హెచ్ఈసీలో 660, సీఈసీలో 704 సీట్లు ఉండగా, ఒకేషనల్ కోర్సులో 352 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ సెక్టర్ కళాశాలలైన కస్తూర్బా, మోడల్, టీఎస్ గురుకుల, మైనార్టీ కళాశాలల్లో ఎంపీసీలో 1012, బైపీసీలో 1056, సీఈసీలో 880, ఒకేషనల్ కోర్సులో 88 సీట్లు ఉన్నాయి.
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రైవేట్ దీటుగా ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన ప్రాంగణాలు, ఉచిత సౌకర్యాలతో విదార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేని విద్యా అందుతున్నది. ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి. ఏటా ప్రభుత్వ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
-సత్యనారాయణ,జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, మెదక్