మెదక్, మే 10 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. జనవరి 16వ తేదీన మొదటి దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశవర్కర్లకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభమైన రెండోవిడుత వ్యాక్సినేషన్లో ఫ్రంట్లైన్ వర్కర్లు ప్రభుత్వ, మున్సిపల్, పంచాయతీ, పోలీసు తదితర ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత 45ఏండ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపతున్న వారికి టీకాలు వేస్తున్నారు. పలువురు రకరకాల భయాందోళనతో టీకా వేసుకునేందుకు వెనుకడుగు వేశారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఇదే సమయంలో కరోనా రెండోవేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందడంతో ప్రతిరోజు మరణాలు, కేసులు అధికమయ్యాయి. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు టీకాపై అవగాహన కల్పించడంతో ప్రజలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకునేందుకు పెద్దసంఖ్యలో ముందుకు వస్తున్నారు.
వ్యాక్సిన్కు పెరుగుతున్న డిమాండ్..
రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండడంతో టీకాకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో వ్యాక్సినేషన్కు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యాక్సినేషన్ వేసేందుకు మెదక్ జిల్లాలో 24కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 20పీహెచ్సీలు కాగా, ఒక జిల్లా కేంద్ర దవాఖాన, నర్సాపూర్లో ఏరియా దవాఖాన, తూప్రాన్, రామాయంపేటలలో సీహెచ్సీ కేంద్రాల్లో ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి లక్షా16వేల309 మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3550 మందికి సెకండ్ డోస్ టీకాను వేశారు. రెండోడోస్ కోసం ప్రజలు పీహెచ్సీల వద్ద బారులు తీస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ నెల 15 తర్వాత 45ఏండ్లు పైబడిన వారికి మొదటి డోస్ టీకాను వేయనున్నారు.
జిల్లాలో 24కేంద్రాల్లో టీకా..
మెదక్ జిల్లాలో 24కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా16వేల మందికి టీకా వేశారు. 3550 మంది సెకండ్ డోస్ వేసుకున్నారు. ఈ నెల 15 తర్వాత 45ఏండ్ల్లు నిండిన వారికి మొదటి డోస్ టీకాను ప్రారంభిస్తాం. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్క్ తప్పకుండా ధరించాలి.