మెదక్, మే 10 : మిల్లులకు వచ్చే ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేసి, లారీ ఏ కేంద్రం నుంచి వచ్చిందో అదే కేంద్రానికి పంపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ అధికారులకు సూచించారు. సోమవారం తన చాంబర్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. మిల్లర్లు, హమాలీలను ఎక్కువ పెట్టుకొని తమ మిల్లుకు వచ్చిన ధాన్యపు లారీలను వెంటనే ఖాళీ చేసి తిరిగి పంపాలని, ఒకవేళ రైతులే ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకువస్తే హమాలి చార్జీలు చెల్లించాలన్నారు. రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం తరలించడం నుంచి రైతుకు ఖాతాలో డబ్బులు జమ చేసే వరకు వివిధ స్థాయిలలో అధికారులను ఏర్పాటు చేస్తూ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. కానీ, అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆశించిన స్థాయిలో ధాన్యం మిల్లుల్లో అన్లోడ్ కావడం లేదని, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు.
మండల ఇన్చార్జి అధికారులు, డిపీఎంలు, లారీల కొరత ఉన్న కేంద్రాల్లో స్థానికంగా ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించుటకు ఏర్పాటు చేస్తూ లారీ ట్రాన్స్పోర్టు ద్వారా డబ్బులు ఇప్పించాల్సిందిగా సూచించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా తహసీల్దార్లు మానిటరింగ్ చేయాలన్నారు. నేటి నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి లారీల వివరాలు తనకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం మిల్లుల్లో దించిన ట్రక్ షీట్ ప్రకారం వెంటనే టాబ్ ఎంట్రీ చేయాలని పౌర సరఫరాల జిల్లా మేనేజర్, జిల్లా సహకార అధికారులకు కలెక్టర్ సూచించారు. కొల్చారం, నార్సింగిలో పదుల సంఖ్యలో లారీలు నిలిచి ఉన్నాయని, కాగా.. ఇంతవరకు కౌడిపల్లి లారీలు రాలేవని ఫిర్యాదులు అందుతున్నాయని, తహసీల్దార్లు క్లోజ్గా మానిటర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, కొనుగోలు కేంద్రం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.