దశాబ్దాలుగా వేధించిన సమస్య..
చల్మెడ-ఇస్సానగర్, నస్కల్-తుజాల్పూర్ గ్రామాల మధ్యన వాగులపై వంతెనలు లేక ఈ గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరి సమస్యలను తెలంగాణ సర్కారు పరిష్కారం చూపింది. వానకాలం వచ్చిందంటే చాలు వాగులు పారి కామారెడ్డి జిల్లా ఇస్సానగర్, తుజాల్పూర్, మెదక్ జిల్లా చల్మెడ, నస్కల్ గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వాగు పారితే ఈ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపేవారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలకు ఈ గ్రామాల ప్రజలు ఎన్నిమార్లు విన్నవించుకున్నా సమస్యకు పరిష్కారం చూపలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రెండు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ నుంచి కిలోమీటర్ దూరం వెళ్తే కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం తుజాల్పూర్ గ్రామం వస్తుంది.
ఈ రెండు గ్రామాల మధ్య వాగు ఉంది. వానకాలంలో వాగు పారితే రాకపోకలు నిలిచిపోయేవి. అలాగే మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ, కామారెడ్డి జిల్లా ఇస్సానగర్ గ్రామం మధ్యన వాగు ఉంది. దశాబ్దాలుగా ఈ గ్రామాల మధ్య వాగులపై వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ వచ్చారు. వంతెనల నిర్మాణం కోసం నస్కల్, చల్మెడ గ్రామస్తులు పట్టు విడవకుండా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి పలుమార్లు తెచ్చారు. 2019-20లో ఆమె పట్టుబట్టి నాబార్డు నిధుల నుంచి రెండు గ్రామాల్లో బ్రిడ్జిల నిర్మాణానికి రూ.2.80కోట్లను మంజూరు చేయించారు. ఒక్కో బ్రిడ్జి రూ.1.40కోట్లతో టెండర్లను పిలిచి పూర్తి చేశారు. వంతెనల నిర్మాణంతో ఈ గ్రామాల ప్రజల సమస్యలు తీరాయి. రెండు గ్రామాల ప్రజలే కాకుండా ఆ దారి గుండా చుట్టుముట్టు ఉన్న సుమారు 20గ్రామాల ప్రజలకు ఆ వంతెన సౌక్యరంగా మారింది.
గతంలో మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్-తుజాల్పూర్, చల్మెడ-ఇస్సానగర్ గ్రామాలకు చెందిన ఎంతో మంది రైతులు వాగులు దాటుతూ మునిగి మరణించిన ఘటనలు ఉన్నాయి. ఇరు గ్రామాల మధ్య నుంచి రావాలంటే వాగులను దాటి రావాల్సిందే. వాగులు దాటే క్రమంలో రైతులు నీటిలో గల్లంతై మృతిచెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆ సమస్యల నుంచి వారికి విముక్తి లభించింది. నిజాంపేట మండలంలోని చల్మెడ, నస్కల్ గ్రామస్తులతో పాటు కామారెడ్డి జిల్లా తుజాల్పూర్, ఇస్సానగర్ గ్రామస్తులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
వంతెన నిర్మాణ ప్రాంతంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం జరుగుతుండేది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఒకటి ఒకటి ఢీకొని ఎంతో మంది మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరుగకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులను విడుదల చేసి త్వరితగతిన పనులను పూర్తిచేసింది.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషి గొప్పది..
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితోనే ఇరుగ్రామాల మధ్యన ఉన్న వంతెనను నిర్మించుకోగలిగాం. రెండు జిల్లాల మధ్యన దశాబ్దాల కాలంగా సమస్య పరిష్కారానికి ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టకున్నా ఏ నాయకుడు కూడా మా మొరను ఆలకించలేదు. తెలంగాణ సర్కార్తోనే మా చిరకాల సమస్య పరిష్కారమైంది.
చాలా ఇబ్బందలు పడ్డాం..
రెండు గ్రామాల మధ్యన వాగులపై వంతెన లేక చాలా ఇబ్బందులకు పడ్డాం. మీము ఏ పనికి వెళ్లాలన్నా వాగుదాటి తుజాల్పూర్ గ్రామానికి వెళ్లాలి. ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగును దాటాలి. వానకాలంలో మా పొలాల వద్దకు వెళ్లేవాళ్లం కాదు. ఎందుకంటే ఎప్పుడు వాగు నిండుగా ప్రవహించేది. అందుకోసం వాగు పారినన్ని రోజులు వ్యవసాయ పనుల జోలికి వెళ్లేవాళ్లం కాదు.