మెదక్, ఏప్రిల్ 7: యాసంగిలో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువ చేసే 5 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చే అవకాశముందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో యాసంగి పంటల ధాన్యం సేకరణపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత యాసంగి కంటే ఈసారి మూడింతల రెట్లు ధాన్యం 5 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేస్తునట్లు తెలిపారు. గత యాసంగిలో 78 వేల ఎకరాల్లో పంట వేయగా, ఈ యాసంగిలో రెండు లక్షల 12వేల ఎకరాల్లో పంట సాగుచేశారన్నారు. గత వానకాలంలో పంట 1.95 ఎకరాల్లో వేసిన దానికంటే ఈ యాసంగిలో 17వేల ఎకరాల్లో అధికంగా వేసినట్లు తెలిపారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్కెటింగ్ శాఖ ద్వారా 350 కొనుగోలు కేంద్రాలు ఈ నెల 12న ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 55వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉన్నాయని, అక్కడి ధాన్యాన్ని తరలిస్తే వచ్చే ధాన్యాన్ని భద్రపరచ్చవచ్చని డీఎస్వో తెలుపగా, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ను ఫోన్ ద్వారా కోరారు.
బాయిల్డ్ రైస్ను గూడ్స్ వ్యాగన్ ద్వారా బయటి ప్రాంతాలకు తరలించాలని పీడీఎస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘన శ్యాంను ఫోన్ ద్వారా కోరారు. తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలన్నారు. అంతకుముందు ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నిర్వహణపై ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అకాల వర్షాలు పడే అవకాశముంటుందని, అందుకు ప్రతి కేంద్రం వద్ద ప్యాడీ క్లీనర్స్లు, టార్ఫాలిన్లు, గోనె సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రవాణాకు ఇబ్బంది రాకుండా లారీలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద వ్యవసాయ విస్తరణాధికారులు ఉండేలా చూడాలని, ఆర్డీవోలు, తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు పర్యవేక్షించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముద్రించిన ధాన్యం మద్దతు ధర పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఎన్సీడీసీ ద్వారా పావలా వడ్డీకే రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు పీఏసీఎస్లకు ఇచ్చి రైస్ మిల్లులు ఏర్పాటు చేసేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్, డీఎస్పీ కృష్ణమూర్తి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవోలు సాయి రాం, శ్యాంప్రకాశ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
కాళికాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం
సీసీ రోడ్లను నాణ్యతగా నిర్మించాలి