వెల్దుర్తి, ఏప్రిల్ 7: పరిపాలనా సౌలభ్యం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్త మండలాలు, నూతన పంచాయతీలను ఏర్పాటు చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మాసాయిపేట నూతన మండల ప్రా రంభోత్సవం సందర్భంగా మాసాయిపేటలో నూతన తహసీల్, పోలీస్స్టేషన్ను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, రఘునందన్రావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మెన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలతశేఖర్గౌడ్, కలెక్టర్ హరీశ్లతో కలిసి మంత్రి హరీశ్రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాసాయిపేటలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 438 మం డలాలు ఉండగా, రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 103 మండలాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయగా, 541 మండలంగా మాసాయిపేట ఆవిర్భవించిందన్నారు. ఉద్యమాల గడ్డ అయిన మాసాయిపేట అంటే తనకు ఎంతో ప్రేమ అని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు రైలురోకో, ధర్నాలు, రాస్తారోకోల సందర్భంగా మాసాయిపేటకు వచ్చానని అన్నారు.
రైల్రోకో సందర్భంగా రెండు రోజుల పాటు మాసాయిపేటలో రైలు పట్టాలపై ఉద్యమ నాయకులతో కలిసి పడుకున్నానని, గ్రామానికి చెందిన వేదపండితులు రైలు పట్టాలపై యజ్ఞాలు నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. మండలం ఏర్పాటుకు సర్పంచ్ మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి తనను, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని చాలాసార్లు కలిసి విన్నవించారని, సీఎం కేసీఆర్తో ఎమ్మెల్యే మదన్రెడ్డికి ఉన్న సాన్నిహిత్యంతోనే మాసాయిపేట మండలం సాధ్యమైందన్నారు. మాసాయిపేట మండల ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నూతన మండలంగా ఏర్పాటైన మాసాయిపేట మండల కేంద్రంలో నూతన భవనాలు, పోలీస్స్టేషన్, డబుల్ ఇండ్లను నెల రోజుల్లో మంజూరు చేస్తానని హామీనిచ్చారు. మాసాయిపేట మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు..
రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి పథంలో నడవాలని, పల్లెలు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీలకు నెలనెలా ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. గత 20 నెలల కాలంలో పల్లెల అభివృద్ధికి రూ. 5,790 కోట్ల నిధులను విడుదల చేశారన్నారు. నిత్యం జరుగుతున్న పారిశుధ్య పనులతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని మంత్రి హరీశ్రావు అన్నారు. జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నిధులు లేవని, తాము అభివృద్ధిలో భాగస్వాములం కావడం లేదని విజ్ఞప్తితో సీఎం కేసీఆర్ స్థానిక సంస్థలకు రూ. 500 కోట్ల నిధులను కేటాయించారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు స్థానిక సంస్థలకు అందించే నిధులలో రూ. 600 కోట్ల నిధులకు కోత విధించిందని అన్నారు. తెలంగాణలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 70 ఏళ్ల పాటు పరిపాలన చేసిన కాంగ్రెస్, టీడీపీల హయాంలో కాని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల కాలంలోనే చేసి చూపించారని కొనియాడారు.
నాలుగైదు రోజుల్లో ..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నదికే కొత్త నడక నేర్పిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మండలంలోని మాసాయిపేట, హాస్తాల్పూర్, బండపోసాన్పల్లి గ్రామాల్లో రైతువేదికలను ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మెన్ సునీతాలక్ష్మారెడ్డి, జడ్పీ చైర్మెన్ హేమలతశేఖర్గౌడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాసాయిపేట, బండపోసాన్పల్లిలలో మంత్రి మాట్లాడుతూ నాలుగైదు రోజుల్లో గోదావరి జలాలు హాల్దీ వాగు ప్రవహించి, మంజీరా ద్వారా నిజాంసాగర్కు చేరనున్నాయని అన్నారు. హల్దీ, మంజీరాల పరీవాహకంలో సాగు చేసిన 14 వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డిల విజ్ఞప్తితో సీఎం కేసీఆర్ కొండపోచమ్మ ద్వారా నీటిని విడుదల చేయించారన్నారు. మండుటెండల్లో కూడా హల్దీని జీవనదిగా మార్చిన సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని కొనియాడారు.
గత యాసంగిలో మెదక్ జిల్లాలో 78 వేల ఎకరాల్లో వరి సాగు అయితే, ప్రస్తుత యాసంగిలో 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని, గతేడాది కంటే మూడు రెట్లు అధికంగా సాగు అవుతుందని అన్నారు. కేవలం మెదక్ జిల్లాలోనే రూ.600 కోట్ల ధాన్యం పండుతుందని అన్నారు. అంతకు ముందు మంత్రి, ఎమ్మెల్యేలు, చైర్మన్లు మాసాయిపేటలోని సాయిబాబా, రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ చావిడి నుంచి తహసీల్ కార్యాలయం వరకు బోనాలు, బతుకమ్మలు, చలువ పందిరి, డప్పుచప్పుళ్లు, బ్యాండు భాజాలతో నృత్యాలు చేస్తూ, పటాకులు కాల్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, నాయకులు, ప్రజలు భారీ ర్యాలీతో మం త్రికి, ఎమ్మెల్యేలు, చైర్మన్లకు స్వాగతం పలుకగా మంత్రి సభా స్థలికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కార్మికుల సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ దేవేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ రమేశ్, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ సోములు, డీఏవో పరశురాం, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్లు మధుసూదన్రెడ్డి, మమత, నరేందర్రెడ్డి, ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, బాబు, లక్ష్మి, నాయకులు సిద్దిరాములుగౌడ్, సత్యనారాయణ, వీరేశం, నారాయణాచారి, కైలాస్శ్రీను, స్టేషన్శ్రీను, నర్సింహారెడ్డి, నరేందర్రెడ్డి, ఆంజనేయులుతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
రైళ్లు ఆపేందుకు కృషి ..
మాసాయిపేట మండలాన్ని పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషం. 75 రోజుల పాటు నిరాహార దీక్షలు, ఎన్నోమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులకు విన్నపాలు చేసి మాసాయిపేటను మండలంగా సాధించాం. ఎమ్మెల్యే మదన్రెడ్డి పట్టుబట్టి, మం త్రి హరీశ్రావు సహకారంతో మండల ప్రజల విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి సాధించారు. మాసాయిపేట శ్రీనివాసనగర్ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ రైల్ను, లోకల్ రైలు ఆపి మండల అభివృద్ధికి సహకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైలు ఆగేలా కృషి చేస్తా.
ఎన్నో ఏండ్ల కల సాకారం..
ఎన్నో ఏండ్లుగా ఉన్న మాసాయిపేట మండల కల నేడు నెరవేరింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న మాసాయిపేటకు మండల కేంద్రం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మాసాయిపేటను మండల కేంద్రం చేస్తానని సీఎం కేసీఆర్ నర్సాపూర్ సభలోనే వేలాది జనం మధ్యలో ప్రకటించారు. మాసాయిపేట అంటే నాకు ప్రత్యేకం. రెండు ఎన్నికల్లో నాకు మండలంలోనే అత్యధిక మెజార్టీని అందించిన గ్రామం. మాసాయిపేట మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా. మంత్రి హరీశ్రావు సహకారంతో నూతన భవనాలతో పాటు అభివృద్ధి నిధులను త్వరలో మంజూరు చేయిస్తాను. మండలం ఏర్పాటు కృషిచేసిన ప్రతిఒక్కరికి, మండల ప్రజలకు అభినందనలు, శుభాకాంక్షలు.
ఇవీ కూడా చదవండీ…
గని కార్మికులను ఆదుకుంటాం : మంత్రి ఎర్రబెల్లి
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్లో అడ్రస్ మార్చడమెలా
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?