ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు భూ సేకరణకు మరో రూ.8 కోట్లు
ఘనపురం, హల్దీ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల మంజూరుకు కృషి
యుద్ధ ప్రాతిపదికన చెక్డ్యాంలు పూర్తి చేయాలి
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
మెదక్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జిల్లా కేంద్ర దవాఖానలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ప్రారంభం
నేటి నుంచి మెదక్ ప్రభుత్వ దవాఖానలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు
మెదక్/మెదక్ అర్బన్, జూన్ 6 : అక్కన్నపేట నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, నాలుగైదు నెలల్లో రైలు కూత పెట్టేలా చూడాలని రైల్వే అధికారులకు మంత్రి హరీశ్రావు సూచించారు. రైల్వేలైన్ పనులు చివరి దశలో ఉన్నాయని, ఇందుకు రూ.25కోట్లు అవసరమని రైల్వే డివిజనల్ ఇంజినీరు సధర్మ తెలుపగా, వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, రూ.1.35కోట్లతో జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం రైల్వే, రెవెన్యూ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైల్వేలైన్ నిర్మాణానికి గత మార్చిలో రూ.40కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైల్వేకు ఇచ్చామని, మరో రూ.25కోట్లను వెంటనే మంజూరు చేస్తామని, పనులను త్వరతగతిన చేపట్టి వేగవంతం చేసి, దసరా నాటికి రైల్వేస్టేషన్ ప్రారంభించేలా చూడాలని రైల్వే అధికారులను కోరారు.
అనంతరం ఘనపురం ఆనకట్ట ప్రాజెక్టు 1.75 మీటర్ల ఎత్తు పెంచేందుకు భూ సేకరణకు గతంలో రూ.5కోట్లు మంజూరు చేశామని, భూ సేకరణ ప్రక్రియ పూర్తికి మరో రూ.8కోట్లు మంజూరు చేయనున్నామని, తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకొని మరికొన్ని వేల ఎకరాలు సాకులోకి తేవచ్చన్నారు. కొల్చారం వైపు కూడా మరికొంత భూమి సేకరణకు ఎంత డబ్బు కావాలో సమీక్షించి తొందరగా అవార్డు పాస్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ హరీశ్ను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఘనపురం ప్రధాన కాల్వ లైనింగ్ ప్రక్రియ పూర్తి చేసుకున్నామని, కాళేశ్వరం నీళ్ల ద్వారా చిట్ట చివరి భూములకూ సాగు నీరు అందించేందుకు ఇంకా మిగిలిపోయిన టేలెండ్లో ఉన్న ప్రధాన కాల్వలతో పాటు డిస్ట్రిబ్యుటరీ నెట్వర్క్ లైనింగ్కు రూ.55కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. హల్దీ ప్రాజెక్టు ఆధునీకరణకు కాల్వలు, సిమెంట్ లైనింగ్ కోసం కావాల్సిన రూ.25కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. ఘనపురం, హల్దీ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.
హల్దీ ప్రాజెక్టు మీద ఆరు చెక్డ్యాంలు, మంజీర మీద 9 చెక్డ్యాంల నిర్మాణం చేపట్టగా, ఇప్పటి వరకు 7 నిర్మించామని, మిగిలినవి కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షల కోసం జిల్లాలో రాపిడ్ టెస్టులు మాత్రమే చేసేవారని, అందులో భాగంగా జిల్లాలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను ఆదివారం ప్రారంభమైందని, సోమవారం నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్, రెమిడిసివిర్ మందుల కొరత ఉన్నదా? అని వైద్యాధికారులను అడిగారు. రోగులను ఆత్మీయంగా పలుకరించాలని, అదే వారికి సగం ధైర్యం ఇస్తుందన్నారు. అనంతరం పిల్లికొట్టాల్లో నిర్మిస్తున్న ఎంసీహెచ్ దవాఖానకు వెళ్లే రోడ్డును మంత్రి పరిశీలించారు. బీటీరోడ్డు నిర్మించాలని అధికారులను సూచించారు.
అంతకుముందు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రగౌడ్ , జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, నీటి పారుదల కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసరావు. ఆర్డీవో సాయిరాం. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.