ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్, జూన్ 1 : రైతులకు వానకాలం సీజన్లో డీసీఎంఎస్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 200 కేంద్రాలు ఏర్పా టు చేసి ఎరువులు, విత్తనాలు అమ్మకాలు చేస్తున్నామని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో డీసీఎంఎస్ గోదాం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్రావు కృషితో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్ కంటే తక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీఏపీ 17844 మెట్రిక్ టన్నులు పొటాష్ ఎరువులు నిల్వలు ఉన్నాయన్నారు. ప్రతి రైతుకు ఎరువులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 30 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. జహీరాబాద్ డీసీఎంఎస్ గోదాంలో 16 వేల బస్తాలు నిల్వ చేసే ఆవకాశం ఉందన్నారు. గోదాంలో 10 బస్తాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, సంగారెడ్డి జిల్లాకు ఇక్కడి నుంచి అవసరం అనుకంటే సరఫరా చేస్తామన్నారు. డీసీఎంఎస్ ద్వారా తక్కువ ధరకు ఎరువులు అమ్మకాలు చేస్తున్నామని, లాభాలు లేకుండా పని చేసి ఆదర్శంగా నిలిచామన్నారు. జహీరాబాద్, గజ్వేల్లో డీసీఎంఎస్ ద్వారా సమీకృత మార్కెటింగ్ షాపులు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపించగా, ఆమోదం లభించిందన్నారు. జహీరాబాద్లో రూ. 10 కోట్లతో సమీకృత మార్కె ట్ నిర్మిస్తామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.