మద్దూరు, ఏప్రిల్ 30 : మండల కేంద్రంతో పాటు మండలంలోని లద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మండల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని మద్దూరు, లద్నూర్ పీహెచ్సీల వైద్యాధికారులు డాక్టర్ రాజు, డాక్టర్ సుధారాణి అన్నారు. శుక్రవారం మద్దూరు పీహెచ్సీలో 69మందికి, లద్నూర్ పీహెచ్సీలో 22మందికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడారు. ప్రారంభంలో టీకా వేసుకునేందుకు ప్రజలు కొంత భయాందోళనకు గురైనప్పటికీ, ప్రస్తుతం టీకాలు వేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పీహెచ్సీలకు వస్తున్నారన్నారు. 45ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా టీకాలు వేసుకోవాలన్నారు. 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ప్రశాంతంగా వ్యాక్సినేషన్..
దుబ్బాక, ఏప్రిల్ 30 : ప్రశాంతంగా కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుంది. సర్కారు దవాఖానల్లో ఆధార్ కార్డుల ఆధారంగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం 45 ఏండ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ చేయటంతో గ్రామీణ ప్రజలు సంబంధిత సీహెచ్పీ, పీహెచ్సీ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ కోసం దవాఖానలకు వస్తున్నారు. పూర్తి పారదర్శకతతో వైద్య సిబ్బంది ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మొదట ఆధార్ కార్డులతో రిజిస్ట్రిషన్ చేసి, అనంతరం కొవిడ్ పరీక్షలు జరిపి, వ్యాక్సినేషన్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 42 వేల మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
చేర్యాల, ఏప్రిల్ 30 : పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నెల 10వ తేదీ వరకు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు మరియు చికెన్, మటన్, కూరగాయల షాపులు మధ్యాహ్నం 2గంటలకు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపారు. ఈ నెల 4వ తేదీన కొనసాగే వారంతపు సంతను కూడా రద్దు చేస్తున్నామన్నారు. దవాఖానలు, మెడికల్ షాపులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు మంగోలు చంటి, చెవిటి లింగం తదితరులు ఉన్నారు.