-జడ్పీ స్థాయి సంఘ సమావేశంలో నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ : ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరును జిల్లా అధికారులు పర్యవేక్షించాలని నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా ప్రజాపరిషత్ మూడోస్థాయి సంఘ సమావేశం జడ్పీ కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగింది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వ్యవసాయం, పశుపోషణ, పాడి పరిశ్రమ, అటవీ శాఖ, మత్స్యశాఖ, ఉద్యానవనం, పౌరసరఫరాలు, మార్కెటింగ్, భూగర్భశాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిధులను పెద్ద ఎత్తున మంజూరు చేసి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఏవైనా సాంకేతిక కారణాలు ఉంటే ఉన్నతాధికారులతో చర్చించాలని సూచించారు. పచ్చదనాన్ని పెంచుతూ అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అటవీ శాఖాధికారులకు సూచించారు. ప్రజాప్రయోజనకోసం చేపట్టే పనులకు అటవీ అధికారులు సహకరించాలన్నారు. తెలంగాణలో 33 శాతం పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అటవీ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అటవీ విస్తీర్ణం, హరితహారంలో నాటిన మొక్కలు తదితర విషయాలను ఎఫ్ఆర్వో మనోజ్కుమార్ను అడిగి ఆయన తెలుసుకున్నారు.
అదేవిధంగా జిల్లాలో వానకాలం, యాసంగి సాగు విస్తీర్ణంపై జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్నాయక్ను అడిగి తెలుసుకున్నారు. జీవాలకు సీజనల్ వ్యాధులు రాకుండా రూ.16 లక్షల ఖర్చుతో 6లక్షల83 వేల 790 వేల నట్టలనివారణ మందు, 365 లేగ దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు పశుసంవర్ధ శాఖ అసిస్టెంట్ తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ ఎంతవరకు వచ్చిందని, లబ్ధిదారులకు తొందరగా పంపిణీ చేయాలని సూచించగా.. జిల్లాలో653 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారని వారికి త్వరలోనే 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
వెల్దుర్తి మండల కేంద్రంలోని పశువైద్యశాలలో కొన్ని నెలలుగా పశు వైద్యుడు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెల్దుర్తి జడ్పీటీసీ రమేశ్గౌడ్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పశువైద్యుడిని నియమించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల నివేదికలను చదివి వినిపించారు. జిల్లా భూగర్భజలాధికారి, అటవీశాఖాధికారి, మార్కెటింగ్ అధికారి, పాడి పరిశ్రమాధికారి, పశుసంవర్దశాఖాధికారి, పౌరసరఫరాలాధికారి సమావేశానికి రాకుండా కిందిస్థాయి ఉద్యోగులను పంపించడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాలకు సమగ్ర సమాచారంతో జిల్లాస్థాయి అధికారులు వస్తేనే పూర్తి సమాచారం వస్తుందన్నారు.
వచ్చే సమావేశాలకు జిల్లాస్థాయి అధికారులే రావాలన్నారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన 5 స్థాయీ సంఘ సమావేశం కొల్చారం జడ్పీటీసీ మేఘమాల అధ్యక్షతన స్ర్తీ, సంక్షేమం ఇతర అంశాలపై చర్చించారు. 6వ స్థాయీ సంఘ సమావేశం రామాయంపేట జడ్పీటీసీ సంధ అద్యక్షతన షెడ్యూల్డ్ తెగల, కులాల సంక్షేమం, అభివృద్ధి, వెనుకబడిన తరగతులు సంక్షేమం, అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమం, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశాలలో జడ్పీ సీఈవో శైలేశ్,, జడ్పీటీసీలు సరోజ, కవిత, కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్ అహ్మద్ తదితర అధికారులు పాల్గొన్నారు.