మనోహరాబాద్ : ఒకరికి సాయం చేసేందుకు మరోచోట అప్పులు చేసి అతడిని ఆదుకున్నాడు.. సాయం పొందిన వ్యక్తి ముఖం చాటేయడంతో చేసిన అప్పులు తీర్చలేక యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం… తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన లంబ సత్యనారాయణ (30) డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు.
ఇదిలా ఉండగా నాలుగేండ్ల కితం ఆ గ్రామానికే చెందిన కుమ్మరి నాగరాజు రూ.5 లక్షలు అవసరం ఉందని సత్యనారాయణకు తెలపగా.. అతడు వేరొకరి వద్ద రూ.5 లక్షలు అప్పుగా తెచ్చి నాగరాజుకు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేటప్పుడు ఎలాంటి ష్యూరిటీని తీసుకోలేదు. సత్యనారాయణ పలుసార్లు డబ్బులు తిరిగి ఇవ్వమని నాగరాజును కోరినా ఇవ్వలేదు. ఆరు నెలల కితం నాగరాజు గ్రామాన్ని వదిలి కుటుంబంతో కలిసి మేడ్చల్కు వచ్చి నివసిస్తున్నాడు.
దీంతో సత్యనారాయణ, ఆ గ్రామానికి చెందిన సతీశ్ అనే వ్యక్తితో కలిసి మేడ్చల్కు వెళ్లి నాగరాజును డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, తన వద్ద లేవని మొండికేశాడు. ఈ విషయంలో సత్యనారాయణకు అతడి భార్య భాగ్యకు ఇంట్లో గొడవలు జరగడంతో ఆమె 15 రోజుల కితం తన పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 15వతేదీన భాగ్యను ఇంటికి తీసుకొచ్చేందుకు సత్యనారాయణ వెళ్లగా భాగ్య తల్లి మల్లమ్మ, తండ్రి నర్సింలు, మేనమామ రమేశ్, భాస్కర్ సత్యనారాయణతో గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లోని రేకులకు ఉన్న పైపునకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.