నంగునూరు, ఏప్రిల్ 24 : అక్కెనపల్లి పెద్దవాగు జీవనదిగా మారబోతుంది.. కాలమైనా కాకపోయినా పెద్దవాగు నిండుకుండలా ఉండనుంది. పెద్దవాగులోని నీళ్లు మానేరు నుంచి గోదావరిలోకి వెళ్లేవి.. సీఎం కేసీఆర్ గోదావరి నీళ్లు పెద్దవాగులోకి వచ్చేలా చేసి చరిత్ర తిరగరాశారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో పెద్దోల్ల బంగ్లా వద్ద పెద్దవాగుపై 2 మీటర్ల లోతుతో 3 కి.మీ మేర సైఫన్ (భూగర్భజల పైపులైన్) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. వానకాలం జిల్లాలో 2.20లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈ యాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. గోదావరి నీళ్లు రావడంతో పంటలు ఎండిపోకుండా 60 వేల ఎకరాల్లో అదనంగా వరి సాగై చరిత్ర తిరగరాసింది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రంగనాయసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ కాల్వల ద్వారా రైతులకు సాగునీరు అందడం, 24 గంటల కరెంట్, రైతుబంధు పథకం వంటి వాటితో పంటల సాగు గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. రంగనాయకసాగర్ కుడి కాల్వ కింద 40 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.
నంగునూరు మండలంలో అన్ని గ్రామాలకు నీళ్లు అందించామని, కానీ.. వాగు అవతలి గ్రామాలకు సాగునీరు అందించలేక పోయామన్నారు. పెద్దవాగు మధ్యలో ఉండి వాగు అవతల గ్రామాలు ఉండడంతో ఇవ్వలేకపోయామని తెలిపారు. పెద్దవాగులోకి గోదావరి నీళ్లు వదలాలని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కోరుతూ వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఈఎన్సీ హరిరాంతో కలిసి సైఫన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. దీని ద్వారా అక్కెనపల్లి, ఘనపూర్, ఖాత, కొండరాజుపల్లి, గట్లమల్యాల ఐదు గ్రామాల్లో 7800 ఎకరాల ఆయకట్టు నీరందనుందన్నారు. ఈ సైఫన్ 100 క్యూసెక్కుల కెపాసిటీతో కడుతున్నామన్నారు. దీంతో వాగులోకి నీళ్లు వదులుతామన్నారు. వాగులో ఉన్న చెక్డ్యామ్లన్నీ నిండే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, రైతులు పైపులైన్ వేయడానికి సహకరించాలని మంత్రి కోరారు. పెద్ద వాగుపై 7 చెక్డ్యాంలు నిర్మించుకున్నామన్నారు. మరో 2 చెక్డ్యాంలు మంజూరు చేసుకున్నామని, రూ.9 కోట్లతో నిర్మించుకుంటామన్నారు. త్వరితగతిన పూర్తి చేసి వానకాలంలో నింపుకుందామన్నారు. తద్వారా పెద్దవాగు జీవనదిగా మారుతుందని మంత్రి హరీశ్రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
గోదావరి నీళ్లను తెచ్చి వచ్చే శివరాత్రి నాటికి ఖాత మహదేవుని స్వామిని అభిషేకం చేద్దామని మంత్రి హరీశ్రావు అన్నారు. నంగునూరు మండలంలో గోదావరి నీళ్లు గలగల పారనున్నాయన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఈనెల కూడెల్లి వాగులోకి గోదావరి నీళ్లు వదిలితే ఇంకా 45 రోజుల నుంచి మత్తళ్లు దుంకుతనే ఉన్నాయన్నారు. హల్దీ వాగులోకి నీళ్లు వదిలితే 100 కిలోమీటర్లు పారి నిజాంసాగర్ వరకు ముట్టాయన్నారు. పెద్దవాగును జీవనదిగా మార్చాలని ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. యాసంగి పంట వరకు సైఫన్ పూర్తి చేసి నుంచి నీళ్లు వదులుతామన్నారు. నంగునూరు మండలంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందనుందన్నారు.
దీంతో పాటు ఎల్డీ 10 కెనాల్ పనులు కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. దీని ద్వారా ఆంక్షాపూర్, ఖానాపూర్, నంగునూరు, మైసంపల్లి, నాగరాజుపల్లి, దానంపల్లి, కమలాయిపల్లి 6 వేల ఎకరాలు, సైఫన్ ద్వారా 7,800 ఎకరాలు, మొత్తం 13,800 ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. 2 నెలల్లో ఎల్డీ 10 కాల్వ పనులు పూర్తి చేయాలన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు రైతులందరూ సహకరించాని మంత్రి కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, కొమురవెల్లి ఆలయ కమిటీ చైర్మన్ దువ్వల మల్లయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్గౌడ్, సర్పంచులు చౌడుచర్ల మమత జైపాల్రెడ్డి, తిప్పని రమేశ్, వెంకటేశం, ఎంపీటీసీలు సునీత మహేందర్గౌడ్, తిరుపతి, రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంగు పురేందర్, రాంరెడ్డి, బాలపోచయ్య, కనకయ్య, మల్లేశం, డిప్యూటీ ఈఈ చంద్రశేఖర్, ఏఈ ఇర్ఫాన్, వర్క్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.