మెదక్ : జిల్లాలో ఆహార శుద్ధి, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నాయని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కంపెనీల ఏర్పాటుకు ముందుకు రావాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమలను నెలకొల్పేందుకు టీఎస్ ఐ-పాస్ కింద గత 6, 7 ఏండ్లుగా సులువుగా అనుమతులు, రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు వాణిజ్య పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సోర్డ్ కంపెనీలు, అనుబంధ శాఖలతో ఏర్పాటు చేసిన ఎగుమతుల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు మూడు జాతీయ రహదారులు, రైలు సౌకర్యంతోపాటు హైదరాబాద్ సమీపంలో ఉన్నందున ఎగుమతులకు ఎన్నో అవకాశాలున్నాయని పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని, పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు.
పరిశ్రమల ఏర్పాటు తర్వాత ఎగుమతులు చేయటంలో ఇబ్బందులు, సమస్యలుంటే తగు సలహాలు, సూచనలిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని సమావేశానికి హాజరైన 8 పరిశ్రమల ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. అనంతరం వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ కృష్ణమూర్తి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వేణుగోపాల్రావు, ఏడీ మైన్స్ జయరాజ్, జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్, మత్స్యశాఖ ఏడీ మల్లేశం, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, టీఎస్ ఐఐసీ ఈవో, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.