సంగారెడ్డి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరు చేస్తున్నది. కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నది. పాజిటివ్ వచ్చిన వారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు పీహెచ్సీలతో పాటు కమ్యూనిటీ హెల్త్సెంటర్, జిల్లా కేంద్ర దవాఖానల్లో అవసరమైన బెడ్స్ అందుబాటులో ఉంచింది. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానలో 500 బెడ్స్ను అందుబాటులో ఉంచారు. పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవల కోసం హైదరాబాద్ తరలించాల్సి వస్తే అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. కాగా, ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ప్రజలు ఇంకా కొంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారు. పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రజలు గుంపులుగా తిరగడంతో పాటు షోరూమ్లు, బట్టల దుకాణాలు, సూపర్ మార్కెట్లలో గుంపులుగా కనిపిస్తున్నారు.
దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తేనే కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 12,128 కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,003 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. 3,048 మంది హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆరుగురు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా 74 మంది మృతిచెందారు. శనివారం ఒక్కరోజు జిల్లాలో 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 204 కేసులకు గాను 176 కేసులు పట్టణాల్లో, 28 కేసులు మండలాల్లో నమోదయ్యాయి. సదాశివపేటలో 38, జోగిపేటలో 35, నారాయణఖేడ్లో 30 , జహీరాబాద్లో 28, పటాన్చెరు 24, సంగారెడ్డిలో 21 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతున్నది. అర్హులందరికీ పీహెచ్సీ, వైద్య విధాన పరిషత్ దవాఖానల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారి గాయత్రీదేవి తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతున్నది. 41 ప్రభుత్వ దవాఖానలు, ఎనిమిది ప్రైవేటు దవాఖానల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. శనివారం వరకు మొత్తం 1,09,271 మంది వ్యాక్సిన్ వేశారు. 7,241 మంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మొదటి డోస్, 5285 మంది రెండో డోస్ టీకా వేసుకున్నారు. కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్లో 9,673 మంది మొదటి డోస్, 3,897 మంది రెండో డోసు టీకా తీసుకున్నారు. 60 ఏండ్లు పైబడిన వారిలో 29,434 మంది మొదటి డోస్, 1191 మంది రెండో డోస్ టీకా వేసుకున్నారు. 60 ఏండ్లలోపు 50,922 మంది మొదటి డోస్, 1,628 మంది రెండో డోస్ టీకా వేసుకున్నారు. జిల్లాలో కరోనా టీకాల కొరత లేదని, అవసరమైనన్ని వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
మెదక్, ఏప్రిల్ 24: మెదక్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ కోసం పరుగులు తీస్తున్నారు. శనివారం జిల్లాలోని 24 కేంద్రాల్లో 3,899 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు తెలిపారు. మెదక్ జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 82వేల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మొదటి డోస్లో 75,256 మందికి, రెండో డోస్లో 6,801 మంది వేసుకున్నారని తెలిపారు. మొత్తం 82వేల మందికి టీకా వేశామని చెప్పారు. కరోనా వైరస్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మెదక్ జిల్లాలో కరోనా చికిత్సకు, పడకలు, మందులు, ఆక్సిజన్కు కొరత లేదు. జిల్లాలోని మెదక్ జిల్లా కేంద్ర దవాఖానతో పాటు నర్సాపూర్ ఏరియా దవాఖాన, తూప్రాన్ సీహెచ్సీ దవాఖానల్లో కరోనా రోగులు చికిత్సలు పొందుతున్నారు. మెదక్ జిల్లాలో జిల్లా కేంద్ర దవాఖానతో పాటు నర్సాపూర్ ఏరియా దవాఖాన, తూప్రాన్ సీహెచ్సీ సెంటర్లు ఉన్నాయి. అయితే జిల్లా కేంద్ర దవాఖానలో 90 సిలిండర్ల ద్వారా కరోనా రోగులకు ఆక్సిజన్ అందజేస్తున్నారు. నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిలో 30 సిలిండర్లు, తూప్రాన్ సీహెచ్సీ సెంటర్లో 30 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 24 : సిద్దిపేట జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని దవాఖానలతో పాటు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది టీకా వేస్తున్నారు.జిల్లాలో 45 ఏండ్లు పైబడిన వారు 1.60 లక్షల మంది ఉండగా, శనివారం వరకు 1.50 లక్షల మందికి టీకా వేశారు. పాజిటివ్ వచ్చిన వారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు పీహెచ్సీలతో పాటు కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, జిల్లా కేంద్ర దవాఖానల్లో అవసరమైన బెడ్స్ అందుబాటులో ఉంచింది. సిద్దిపేట జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా మొత్తం 350 పడకల్లో ఆక్సిజన్ సపోర్టు బెడ్లుగా మార్చుతున్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల జనరల్ దవాఖానలో 35 ఐసీయూ వెంటిలేటర్ల బెడ్లు, 65 ఆక్సిజన్ బెడ్లు, మరో 20 నాన్ ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. జిల్లాలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది.