వెల్దుర్తి, మే 6: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట శివారులో జమున హేచరీస్ నిర్మాణాల కోసం మాజీమంత్రి ఈటల ప్రభుత్వ భూమిలో నుంచి వేసిన రోడ్డులో నరికేసిన చెట్లపై అట వీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. గురువారం రామాయంపేట డిప్యూటీ రేంజ్ అధికారి కుత్బుద్దీన్, చిన్నశంకరంపేట సెక్షన్ అధికారి ఆజాంలు రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. సంబంధిత రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కుత్బుద్దీన్ మాట్లాడుతూ.. సుమారు కిలోమీటర్ మేర ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మించారని తెలిపారు. ఇందులో 23 మామూలు సైజు చెట్లు, 5 ఎడ్లబడ్ల కంప నరికివేతకు గురైనట్టు గుర్తించామని చెప్పారు. రోడ్డు నిర్మాణంపై పరిశ్రమ ప్రతినిధులను వివరణ కోరగా తాము కొద్దిదూరం మాత్రమే రోడ్డు నిర్మా ణంచేపట్టామని వెల్లడించారు. అక్కడినుంచి గ్రామానికి వెళ్లి రైతులను విచారించామని.. తాము ఎలాంటి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని గ్రామస్థులు చెప్పడంతో పంచనామా నిర్వహించామని వివరించారు. నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.