మెదక్, జూలై 29 : కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లకు మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో రీసైకిల్ చేయాలని సూచించారు. వైద్యశాల నుంచి వచ్చే బయో వ్యర్థాలను మున్సిపల్ వ్యర్థాలతో కలిపితే, కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లి, చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లు బయో వ్యర్థాలను బయట పడేయకుం డా చూడాలని, లేకపోతే కేసులు పెడుతామని హెచ్చరించాలని డీఎంహెచ్వోకు సూచించారు. మున్సిపల్ పరిధిలో నిషేధించిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడుతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఎస్పీ కృష్ణమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరా న్మెంట్ ఇంజినీర్ రవికుమార్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, ఏడీ మైన్స్ జయరాజ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
లే అవుట్ల ఆడిట్ నిర్వహణ చేయాలి
పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో 2014 సంవత్సరం తర్వాత అనుమతించిన లే అవుట్ల ఆడిట్ నిర్వహణ చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ హరీ శ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమవేశంలో మాట్లాడుతూ లే అవుట్లలో 10శాతం ఓపెన్ స్పెస్ స్థానిక, పట్టణ సంస్థ పేరున రిజిస్ట్రర్ చేయాలని, పది శాతం కన్నా తక్కువ లే అవుట్ ఉంటే ఒరిజినల్ డెలవపర్ నుంచి ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం పెనాల్టీ విధించాలని సూచించారు. డీటీసీసీ మార్గదర్శకాలకనుగుణం గా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. అక్రమ లే అవుట్లను గుర్తించి తొలిగించాలని అన్నారు. రెండు వారాల్లోగా అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఈ సంవత్సరం నిర్ధేశించిన పన్ను వసూళ్లను ఇప్పటి నుంచే లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. అదే విధంగా మున్సిపాలిటీల్లో ఉన్న స్థిర, చరాస్తుల వివరాల జాబితా అందజేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు శ్రీహరి, మోహన్, అశ్రిత్కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 4లోగా వైకుంఠధామాలు పూర్తి చేయాలి
ఆగస్టు 4లోగా వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇటీవల భూమి గుర్తించి అప్పగించిన ఏడు వైకుంఠధామాలు మినహా మిగతావన్నీ ఆగస్టు 4లోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలన్నారు. ఏడు వైకుంఠధామాలు ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని, ఎటువంటి కుంటి సాకులు చెప్పరాదని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తయ్యేలా చూడాలన్నారు.