అదే స్థాయిలో కోడి గుడ్డు రూ.6
బెంబేలెత్తుతున్న వినియోగదారులు
మెదక్ మున్సిపాలిటీ, జూలై 21 : కోడి కొండెక్కి కూర్చుంది.. చికెన్, గుడ్ల ధరలు పైపైకి పాకుతున్నాయి. కరోనా నేపథ్యంలో బలవర్థక ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది. అంతకుముందు చికెన్ కిలో రూ.180 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.270 ధర పలుకుతోంది. రూ.4 ఉన్న గుడ్డు ధర ప్రస్తు తం రూ.6 పైగా ఎగబాకింది. పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
కరోనాకు ముందు సాధారణ ధరలకే చికెన్, గుడ్లు దొరికేవి. ఇంతలోనే కరోనా పిడుగు వచ్చిపడింది. ఈ నేపథ్యంలో చికెన్ తినడంతో వైరస్ వ్యాప్తి చెందుతుందనే వదంతులు షికారు చేశాయి. ఇంకేముంది అటువైపు జనం కన్నెత్తి చూడకపోవడంతో అప్పట్లో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అనంతరం చికెన్, గుడ్లలో వైరస్ లేదని, వీటిని ఆహారంగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని వైద్యులు సూచించడంతో ప్రజలు చికెన్ సెంటర్ల బాట పట్టారు. అప్పటి వరకు చికెన్ జోలికి వెళ్లని జనాలు ఒక్కసారిగా చికెన్, గుడ్లు కొనడం మొదలుపెట్టారు. ధర కూడా తక్కువ ఉండటంతో రోజుకు మూడు గుడ్లు లాగించేశారు. దీంతో అప్పటి వరకు గిరాకీలు లేక వెలవెలబోయిన దుకాణాలు మళ్లీ కళకళలాడాయి.
అమాంతంగా పెరిగిన ధర..
క్రమంగా చికెన్ వినియోగంతో పాటు ధర సైతం అమాంతంగా రోజురోజుకూ పెరుగుతోంది. కరోనాకు ముందు కిలో చికెన్ (స్కిన్లెస్)ధర రూ.180 ఉండగా.. ప్రస్తుతం రూ.270కి చేరింది. కోడిగుడ్డు ధర రూ.4ఉంటే ఇప్పుడు రూ.6 వరకు పలుకుతోంది. కోళ్ల పెంప కం, గుడ్ల ఉత్పత్తికన్నా వినియోగం గణనీయంగా పెరగడంతో ధరలు సైతం ఆ స్థాయిలో చుక్కలు చూపిస్తున్నాయి. కరో నా మొద ట్లో ధరలు విపరీతంగా తగ్గడం తో కోళ్ల పెంపకం దారులు, చికెన్ సెంటర్ల నిర్వాహకులు కష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని భావించారు. ఈ తరుణంలో ఒక్కసారిగా చికెన్, గుడ్ల ధరలు పెరగడంతో వారు ఊపిరి పీల్చుకోగా.. వినియోగదారులు మాత్రం పెరిగిన ధరలతో చికెన్ తినడానికి జంకుతున్నారు. మేక మాంసానికి దీటుగా చికెన్ ధరలు పెరగడమేమిటని ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవానికి మాంసాహారం కంటే పప్పు దినుసుల్లో అధికంగా ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, జనం మాత్రం చికెన్, గుడ్లపైనే మక్కు వ చూపుతున్నారు. ప్రస్తుతం మెదక్ మార్కెట్లో స్కిన్లెస్ ధర.270 పలుకుతుండగా, బోన్లెస్ కీలో రూ.580 వరకు విక్రయిస్తున్నారు.