మియాపూర్, జూలై 11 : ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అన్ని వేళలా వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి పథకం కింద మంజూరైన రూ. 4.32 లక్షల చెక్కులను కార్పొరేటర్లు రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలసి విప్ గాంధీ ఆదివారం వివేకానందనగర్లోని తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకుంటూ వారి ఆరోగ్యాలకు సీఎం సహాయనిధి పథకం ఎంతో భరోసాగా నిలుస్తున్నదన్నారు. నిరంతరం తన సేవల ద్వారా పేదలకు కొండంత అండగా ఉపయోగపడుతున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఆర్థిక స్తోమతలేక అనారోగ్యాల బారిన పడుతున్న వందలాది మంది పేదలకు సీఎం సహాయనిధి ఆరోగ్య భరోసాను కల్పించి పూర్తి స్వస్థత పొందేందుకు దోహదపడుతున్నదని విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మాధవరం రంగారావు, సంజీవరెడ్డి, పెద్ద భాస్కర్రావు, కోనేరు ప్రసాద్, సమ్మారెడ్డి, శ్రీనివాస్, రాజేశ్చంద్ర, వాసు, శిరీష తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని కావూరిహిల్స్లో నూతనంగా నిర్మించిన పార్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం ప్రారంభించారు. కావూరిహిల్స్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్రవంతి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యనమదల వెంకటేశ్వరరావు స్మారకంగా పార్కుకు శ్రీ యనమదల వెంకటేశ్వరరావు స్మారక నగర పాలిక ఉద్యానవనంగా పేరును పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. నగరంలో పార్కులతో పాటు ప్రత్యేక థీమ్ పార్కుల ఏర్పాటు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. కావూరిహిల్స్ ప్రజలతో పాటు చుట్టు పక్కల వారికి ఆహ్లాదాన్ని అందించే విధంగా పార్కును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఓపెన్ జిమ్తో పాటు పిల్లలు ఆడుకునేందుకు, పెద్దవారు సేద తీరేందుకు సౌకర్యవంతంగా పార్కును తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, కావూరిహిల్స్ కాలనీ వాసులు ఠాగూర్, రవికుమార్, శరత్, గిరిధర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.