ఎల్బీనగర్, జూలై 11 : నియోజకవర్గంలో పక్కా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం మార్నింగ్ వాక్లో భాగంగా చంపాపేట డివిజన్ పరిధిలోని వంగ శంకరమ్మ గార్డెన్స్ నుంచి మెగా ఫంక్షన్ హాల్ వరకు నిర్మించదలచిన బాక్స్ డ్రైన్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపాటి వర్షానికి పక్క కాలనీ నుంచి వచ్చే వర్షపునీటి వల్ల కాలనీలన్నీ ముంపునకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో గతంలో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ అధికారులతో మళ్లీ పునఃపరిశీలన చేస్తున్నామని వెల్లడించారన్నారు. ప్రణాళికలో కొన్ని చిన్నచిన్న అవంతరాలు వస్తున్న నేపథ్యంలో కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని సూచించారు. భవిష్యత్లో కాలనీల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరదనీరు సాఫీగా వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పనులు నెల రోజుల్లో ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.