మన్సూరాబాద్, జూలై 9: కుమారుడిని రక్షించుకునే ప్రయత్నంలో గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. నాగోల్ పరిధిలోని బండ్లగూడ రామాలయం సమీపంలో నివసించే బల్ల చంద్రశేఖర్ అలియాస్ చందు ప్రైవేటు ఉద్యోగి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడికి డబ్బులు అవసరమయ్యాయి. దిల్సుఖ్నగర్లోని పిల్లి గుడిసెల బస్తీలో ఉంటున్న స్నేహితుడు తన్నీరు రవి (24)కి తన ఆర్థిక పరిస్థితి చెప్పాడు. రవి మధ్యవర్తిగా వ్యవహరించి దిల్సుఖ్నగర్కు చెందిన నవీన్ అలియాస్ టిల్లు వద్ద రూ. 10 వేలు చందుకు ఇప్పించాడు. కొన్ని రోజుల తర్వాత చందు రూ. 8 వేలు చెల్లించాడు. మరో రూ. ఐదు వేలు చెల్లించాల్సి ఉంది.
ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు చెల్లించలేకపోయాడు. డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉన్న రవి ఈనెల 5వ తేదీ రాత్రి మద్యం మత్తులో బండ్లగూడలోని చందు ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంపై చందుతో గొడవపడటమే కాకుండా నానా దుర్భాషలాడాడు. మద్యం మత్తులో ఉన్న రవి కోపంతో బండ రాయితో చందుపై దాడికి యత్నించాడు. అది గమనించిన చందు తండ్రి బల్ల ఆనందప్ప (55) అడ్డువచ్చాడు. బండరాయి ఆనందప్పకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించగా గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు బల్ల చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడైన తన్నీరు రవిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.