కంటోన్మెంట్, జూలై 9: కంటోన్మెంట్ బోర్డు అధికారుల తీరుతో తీవ్ర అయోమయానికి గురైన ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ‘సేవ్ కంటోన్మెంట్ సిటిజన్ రైట్స్’ పేరిట వరుస సమావేశాలు నిర్వహించి బోర్డు అధికారుల తీరును ఎండగట్టారు. ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన సమావేశాలకు బోర్డు పరిధిలోని సివిల్, బజార్ ప్రాంతాలతో పాటు బీ3 బంగళాలు, స్థలాలకు సంబంధించిన యాజమాన్య హక్కులు, ఇతర అంశాలపై బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సన్నద్ధం చేశారు. అంతకు ముందు ‘క్లార్’ నోటిఫికేషన్ ఆధారంగా సివిల్, బజార్ ప్రాంతాల్లోని స్థలాలు, ఇండ్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని బోర్డు అధికారులు బోయిన్పల్లిలోని సబ్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు.
ఇదే విషయమై సబ్ రిజిస్ట్రార్ సైతం బోర్డు నుంచి ఆదేశాలు రావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర రక్షణ శాఖ 2021 క్లార్ పేరిట జారీ చేసిన నోటిఫికేషన్లోని అంశాలు అభ్యంతరకరంగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు బోర్డు పరిధిలోని ప్రజలకు ఆసరాగా నిలిచారు. క్లార్లోని అంశాలపై ఈ నెల 23 వరకు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని స్థలాలు, ఇండ్లపై ఉన్న యాజమాన్య హక్కులను కోల్పోయే ప్రమాదం నెలకొనడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సామాన్య ప్రజల తరపున టీఆర్ఎస్ నేతలు గొంతు విప్పడంతో ఎట్టకేలకు బోర్డు బ్రిగేడియర్, సీఈఓ దిగొచ్చి ఇండ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆపాలని చెప్పలేదని ప్రకటించారు.
కాని వారి ఆదేశాలతోనే రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడిందని స్వయంగా రిజిస్ట్రారే పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతల ఒత్తిడి కారణంగా అధికారులు దిగొచ్చి, మాటమార్చి రిజిస్ట్రేషన్లు ఆపాలని చెప్పలేదంటూ బుకాయించారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా న్యూ బోయిన్పల్లిలోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో పాటు టీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆరంభం అవుతుందన్నారు. దీంతో సివిల్ బజార్ ప్రాంతాల్లోని స్థలాలు, ఇండ్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగుమమైంది.