లక్నో : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బ్లాక్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. లఖింపూర్ఖేరీ జిల్లాలోని పాస్గ్వాన్ బ్లాక్ నుంచి బరిలో ఉన్న ఎస్పీ మహిళా నాయకురాలు రీతూ సింగ్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బయల్దేరింది.
ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఆమెను నడిరోడ్డుపై అడ్డగించారు. అంతటితో ఆగకుండా రీతూ సింగ్ చీరను లాగారు. నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేశారు. ఈ తతంగాన్ని కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. యోగి ప్రభుత్వం గుండాగిరి చేస్తుందని మండిపడ్డారు. అయితే మహిళపై దాడి వెనుక స్థానిక బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారని ఎస్పీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత మహిళ రీతూ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.