హరితహారాన్ని మించిన ఉదాత్త కార్యక్రమం మరొకటి లేదని.. మానవ ఇతిహాసంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్పేట మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కను నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రూ.5900 కోట్లు ఖర్చు చేసి 220 కోట్ల మొక్కలను నాటామని తెలిపారు. దీంతో తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 ఉద్యానవనాలను అభివృద్ధి పరుస్తున్నామని వెల్లడించారు.
నగర పరిశుభ్రత, పచ్చదనం పెంపు ప్రధాన లక్ష్యాలుగా చేపట్టిన పట్టణ ప్రగతి, ఏడో విడత హరితహారం కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రేటర్కు చెందిన మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో పచ్చదనం మధ్య ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలని ఆకాంక్షించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి తార్నాకలోని లాలాపేట, సత్యనగర్, సీబీఎన్ నగర్ల్లో పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హయత్నగర్లో, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ యూసుఫ్గూడలో, గోషామహల్లో రాజాసింగ్, నాంపల్లిలో ఎమ్మెల్యే బలాల, అంబర్పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ , ఉప్పల్లో ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి, కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రాజేంద్రనగర్లో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లి వీవీ నగర్ కాలనీలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కేపీహెచ్బీ 15 ఫేజ్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పట్టణ ప్రగతి, హరితహారంలో పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం విరివిగా మొక్కలను నాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఖైరతాబాద్లోని దుర్గానగర్లో పట్టణ ప్రగతిని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, పరిశుభ్రమైన వాతావరణంలో, పచ్చదనం మధ్య ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మహానగరం అన్ని రంగాల్లో ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. అనంతరం హరితహారంలో భాగంగా కాలనీ పార్క్లో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, కార్పొరేటర్ విజయారెడ్డి, జోనల్ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు.
రంగారెడ్డి, జూలై 1, (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఏడేండ్లలో రూ.5900 కోట్లను ఖర్చు చేసి 220 కోట్ల మొక్కలను నాటినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోనూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గురువారం జిల్లాలోని పెద్ద అంబర్పేట కలాన్లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మొక్కను నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీ పెంపుదలకు రాష్ట్రవ్యాప్తంగా 109 అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో కొన్ని ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్గా మారిన పరిస్థితుల్లో 1.60 లక్షల ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను హెచ్ఎండీఏ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా రెండో దశతో దేశమంతా తల్లడిల్లిపోయిందని, ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసిందన్నారు. మనకు కావాల్సిన ఆక్సిజన్ చెట్ల ద్వారానే లభిస్తుందని, భవిష్యత్ కోసం పుడమిని కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
హరితహారాన్ని మించిన ఉదాత్తమైన, గొప్ప కార్యక్రమం మరొకటి లేదని, మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలన్నారు. తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిందని, రాష్ట్రంలో పచ్చదనం 33 శాతానికి చేరుకోవాలన్న సీఎం కేసీఆర్ కల నెరవేరి, దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, శంభీపూర్ రాజు, మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ, ప్రత్యేక కార్యదర్శి ఎ.శాంతికుమారి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి, పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, జూలై1(నమస్తే తెలంగాణ): ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని పిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో, ఘట్కేసర్, శామీర్పేట్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో జరిగిన హరితహారానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. రాచకొండ కమిషనరేట్ ప్రాంగణంలో మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి, మేయర్ వెంకట్రెడ్డి, సీపీ మహేశ్భగవత్తో కలిసి మొక్కలు నాటగా, కండ్లకోయలోని అటవీశాఖ కార్యాలయ ఆవరణలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మొక్కలు నాటారు.
మంత్రి వెంట అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆవుషాపూర్, అంకుషాపూర్, డబీల్పూర్, కిష్టాపూర్ గ్రామాల్లో కలెక్టర్ శ్వేతా మహంతి హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, జిల్లాలో హరితహారానికి అనూహ్య స్పందన వచ్చింది. 63 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకోగా, మొదటి రోజు 61 గ్రామపంచాయతీ, 4 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల పరిధిలో 2.42 లక్షల మొక్కలను నాటడం విశేషం.