సిటీబ్యూరో,జూన్ 28 (నమస్తేతెలంగాణ): తెలంగాణ తేజం, తెలుగుకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి,మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు సోమవారం పరిసమాప్తమయ్యాయి. గతేడాది జూన్ 28న పీవీని స్మరిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టింది. కరోనా కారణంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టలేకపోయినప్పటికీ..పీవీ ఘనతను చాటేలా తెలంగాణలోనే కాకుండా జాతీయ,అంతర్జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. శతజయంతి ఉత్సవ కమిటీ తరఫున పీవీ ఘనతను చాటే పుస్తకాలను కూడా ముద్రించారు. పీవీ రచనలు, ఆయన రాసిన అరుదైన 8 కథల సంకలనం, వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాలు, పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై ప్రసంగాల సంకలనం..ఆయా సందర్భాల్లో పీవీని పలు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూలు, పీవీ పాలన, ఆర్థిక సంస్కరణలు, అగ్రనాయకులు రాసిన వ్యాసాల సంకలనం, ఆయన స్ఫూర్తితో 125కు పైగా అంతర్జాతీయ,జాతీయ, రాష్ట్ర కార్టూనిస్టులు వేసిన క్యారికేచర్ల సంకలనం, పీవీ జీవితచరిత్రపై వెలిజాల చంద్రశేఖర్ రాసిన పుస్తకం, ‘నమస్తే పీవీ’ పేరుతో పీవీ నరసింహారావు గురించి ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం, కాలాతీతుడు పేరుతో 43 మంది కవుల కవితా సంకలనాలను సోమవారం పీవీమార్గ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు.