ప్రొబేషనరీ ఎస్ఐలతో సమావేశంలో రామగుండం సీపీ సత్యనారాయణ
ఫర్టిలైజర్సిటీ, జూన్ 26: విధి నిర్వహణలో విచక్షణ, విజ్ఞతతో మానవీయ కోణంతో పని చేయాలని పీఎస్ఐలకు రామగుండం సీపీ సత్యనారాయణ సూచించారు. కమిషనరేట్కు శిక్షణ నిమిత్తం వచ్చిన 29 మంది ప్రొబేషనరీ ఎస్ఐ(పీఎస్ఐ)లతో చట్ట ప్రకారం నేర్చుకోవాల్సిన విధి విధానాలపై శనివారం హెడ్ క్వార్టర్స్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞా నం, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేయాలని, చట్ట పరిధిలో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చేసి ఆ తర్వాత వేరేవాళ్లు ఎవరు అలాం టి నేరం చేయకుండా ఉండాలనే ఆలోచనకు రావాలని సూచించారు. పాత కాలంలో లాగా నిందితులపై బలం ఉపయోగించడం, టార్చర్ పెట్టడం వాటికి ఇప్పుడు తావు లేదన్నారు. లా అండ్ ఆర్డర్ని అదుపు చేసేందుకు తప్పదు అవసరం అనుకున్న సందర్భంలో మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, శాస్త్రీయ ఆధారాలు, కేసుపై సమగ్రమైన పూర్తి పట్టు సాధించి నేర పరిశోధనలు చేయాలని వివరించారు. నిందితులకు శిక్ష పడేలా చేయాలని, మానవ హక్కులకు భంగం కలిగించకూడదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక్కడ డీసీపీ రవీందర్, ఏఆర్ డీసీపీ సంజీవ్, ఏసీపీ ఏఆర్ సుందర్రావు, ఏసీపీ ఉమేందర్, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నారాయణ, సీఐ, సీసీఆర్బీ కమలాకర్, ఆర్ఐలు మధుకర్, శ్రీధర్, విష్ణు, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ..
అనంతరం కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సీపీ సమావేశమయ్యారు. సిబ్బందికి కేటాయించిన ఫీల్డ్ సంబంధిత సమాచారంతోపాటు అక్కడ పరిస్థితులపై ఒక్కొకరితో మాట్లాడారు. ధర్నాలు, రాస్తారోకోలు, రాజకీయంగా, కమ్యూనల్కు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై సమాచారం ముందుగానే సేకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డే వారిపై ప్రజా శాంతికి భంగం కలిగించే వారి కదలికలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ప్రజల్లో మమేకమై సమాచారం ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ హరిశేఖర్ తదితరులు ఉన్నారు.