రామాయంపేట, జూన్ 26 : పదో తరగతి పాసైన విద్యార్థుల ఇంటికే కళాశాల లెక్చరర్లు వెళ్లి ప్రభుత్వ కళాశాలల్లో అందుతున్న విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నారని రామాయంపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లాలోనే అత్యధికంగా రామాయంపేట కళాశాలకు వివిధ గ్రూపుల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి 221 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఆన్లైన్ ప్రక్రియ జూలై 7వ తేదీ వరకు ఉంటుందని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. 17 మంది లెక్చరర్లు మండలంలో ఉన్న 17 జిల్లా పరిషత్ పాఠశాలలను ఎంపిక చేసుకుని టీంల వారీగా విద్యార్థులకు అవగాహన కల్పించి, ఆన్లైన్లో దరఖాస్తులను చేయిస్తున్నారని తెలిపారు. అడ్మిషన్ అయిన విద్యార్థులకు వెంటనే ఆన్లైన్ క్లాసులతో పాటు జూమ్లో కూడా క్లాసులను చెబుతామన్నారు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు జూమ్ క్లాసులు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉచిత పాఠ్యా పుస్తకాలు, స్కాలర్షిప్ కూడా అందిస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ వెంట మల్లేశం, బాలప్రకాశ్, బాబూరావు ఉన్నారు.