హుజూరాబాద్ టౌన్, జూన్ 17: రేషన్ డీలర్లకు ఎనిమిది నెలలుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా కమీషన్ ఇవ్వడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. డీలర్లకు క్వింటాల్కు రూ.35 కమీషన్ నిధులు విడుదల చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం వాటా కలుపుకొని క్వింటాల్కు రూ.70 కమీషన్ ఇస్తున్నదని చెప్పారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో డివిజన్స్థాయి రేషన్డీలర్లతో వారి సమస్యలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. కేంద్రం మొండిచేయి చూపినా పాత బకాయిలు రూ.56 కోట్లను ఏకమొత్తంలో అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చౌకధరల దుకాణాలు నిర్వహించే వారిని ప్రభుత్వంలో భాగంగా స్టేక్ హోల్డర్లుగానే సీఎం కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. త్వరలోనే రేషన్ డీలర్ల న్యాయమైన కోరికలను నెరవేర్చుతామని స్పష్టంచేశారు.