అధికారుల రంగ ప్రవేశంతో వెలుగులోకి..
శిశువును స్వాధీనం చేసుకున్న అధికారులు
నర్సంపేట, జూన్ 13: నర్సంపేట మండలం రాములునాయక్తండాలో మగశిశువును రూ.లక్షకు విక్రయించారు. విషయం తెలుసుకున్న అధికారులు శిశువును స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 10న తండాలో ఓ మహిళ(32) మూ డోకాన్పులో ఇంటి వద్దే మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటికి వెళ్లి బిడ్డ ఎలా ఉన్నాడని ప్రశ్నించారు. దీంతో శిశువు చనిపోయాడని, ఖననం చేశామని అబద్ధం చెప్పారు. వారు అనుమానంతో గ్రామంలో ఆరా తీసి శిశువును విక్రయించినట్లు తెలుసుకున్నారు. వెంటనే శిశు సంరక్షణాధికారులకు సమాచారం అందించడంతో వారు ఆదివారం తండాకు చేరుకుని విచారించారు. మహిళ పెద్దమ్మ గీసుగొండ మండలం దస్రూ తండాకు చెందిన సారమ్మ శిశువు విక్రయంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలియడంతో ఆమెను విచారించారు.
హసన్పర్తికి చెంది న శ్రీనివాస్ దంపతులకు రూ.లక్షకు శిశువును విక్రయించినట్లు తెలుసుకున్నారు. అధికారుల ఆదేశంతో బిడ్డను అప్పగించారు. మొదటి సంతానం, రెండోసంతానంలో కుమార్తె, కుమారుడు ఉన్నారు. దీంతో మూడో సంతానాన్ని హసన్పర్తిలోని పిల్లలు లేని దంపతులకు ఇవ్వడానికి నిర్ణయించారు. ఇందుకు రూ.లక్షకు కొనుగోలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. శిశువును పోషించుకునే స్తోమత లేకనే తాము ఇతరులకు ఇచ్చామని రాతపూర్వకంగా ఇచ్చారు. దీంతో బాలల సంక్షేమ కమిటీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన దంపతులు కూడా తాము దత్తత తీసుకోవాలనే విషయం తెలియక శిశువును తీసుకున్నామని అధికారులకు తెలిపారు. శిశువును దత్తత ఇవ్వాలని దరఖాస్తు చేస్తామని అధికారులకు రాతపూర్వకంగా ఇచ్చారు. మొదటి తప్పుకింద వారిని వదిలివేస్తున్నట్లు అధికారులుతెలిపారు.విచారణ చేసిన వారిలో బాలల సంరక్షణ అధికారి జీ మహేందర్రెడ్డి, ఏఎన్ఎం సలోని, ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ ఝాన్సీ, శ్రీదేవి, సుమన పాల్గొన్నారు.