మెండోరా/ఏర్గట్ల, జూన్ 7 : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ఏర్గట్ల మండలాలకు చెందిన పలువురు బాధితులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం పరామర్శించారు. మెండోరా మండలం బుస్సాపూర్లో మాజీ సర్పంచ్ ఏలేటి రాజరెడ్డి కుటుంబాన్ని, టీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడి కుటుంబాన్ని, దూదిగాంలో మాజీ ఎంపీపీ రాజరెడ్డిని, సర్పంచ్ శ్రీనివాస్ను, మైనార్టీ నాయకుడు నసీర్ కుటుంబాన్ని, చాకిర్యాల్లో రైతుబంధు కో-ఆర్డినేటర్ ముస్కు సాయిరెడ్డిని, సావెల్లో లింగారెడ్డి కుటుంబాన్ని, అల్లకొండ గంగారెడ్డి కుటుంబాన్ని, కొడిచర్లలో ఉపసర్పంచ్ ఎట్టడి గంగారెడ్డిని, వెల్కటూర్లో మారుతి పంతులును, నడిమితండాలో ఏఎంసీ డైరెక్టర్ బన్సీలాల్ను మంత్రి పరామర్శించారు. రైతుబంధు సమితి ఏర్గట్ల మండల కో-ఆర్డినేటర్ సున్నపు అంజయ్య తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని అంజయ్యను మంత్రి పరామర్శించారు. ఏర్గట్ల మండల కేంద్రంతోపాటు తాళ్లరాంపూర్, తడ్పాకల్, గుమ్మిర్యాల్ గ్రామాలకు చెందిన పలువురు కరోనాబారిన పడి మృతి చెందగా, బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించి ఓదార్చారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఏర్గట్ల మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు గుల్లే గంగాధర్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావొద్దని, అందరూ సంతోషంగా ఉండాలన్నారు. దవాఖానల్లో కొవిడ్ బాధితులను పరామర్శించిన సందర్భంలో వారి కళ్లలో ధైర్యం కనిపించిందన్నారు. చాలా మంది భయంతోనే ప్రాణాలను వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారినపడకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని కోరారు.
మెండోరా మండలంలో మంత్రివెంట టీఆర్ఎస్ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్రెడ్డి, ఎంపీపీ సుకన్య కమలాకర్, జడ్పీటీసీ తలారి గంగాధర్, వైస్ ఎంపీపీ సరస్వతీరవిగౌడ్, సర్పంచులు తదితరులు ఉన్నారు. ఏర్గట్ల మండలంలో మంత్రి వెంట ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్, సొసైటీ చైర్మను, సర్పంచులు ఉన్నారు.