హైదరాబాద్: రేషన్కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేస్తున్నారు. గత నెల, ఈ నెల కోటా కింద ప్రతి లబ్ధిదారునికి 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీ ఈనెల 20 వరకు కొనసాగనుంది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా.. ఈనెలలో 15 కిలోలు ఇస్తున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది. గత నెల, ఈ నెల కోటా కలిపి 10 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 కిలోల చొప్పున మొత్తం 15 కిలోలు పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు గతంలో ఇచ్చే కోటాకు అదనంగా మరో 10 కిలోల బియ్యం ఉచితం అందజేస్తారు.