బేగంపేట్ మే 27: నాలా కల్వర్టు నిర్మాణ పనులు, పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉత్తర మండలం జీహెచ్ఎంసీ జోనల్ అధికారులను ఆదేశించారు. గురువారం బేగంపేట్ సర్కిల్ పరిధిలో పర్యటించారు. రాంగోపాల్పేట డివిజన్లోని నల్లగుట్ట జూలమ్మ దేవాలయం వద్ద నాలాల్లో పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. రాష్ట్రపతి రోడ్డులో నిర్వహిస్తున్న నాలా కల్వర్టు పనులు పరిశీలించి, వేగవంతం చేయాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి సూచించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలంలో వరద ముంపు సమస్య వచ్చే ప్రమాదముందని, పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఆగస్టు, సెప్టెంబర్లోపు నాలా కల్వర్టు పనులు పూర్తి చేస్తామని జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నాలాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని కార్పొరేటర్లకు, అధికారులకు మేయర్ సూచించారు. ఆవు పేడను నాలాల్లో వేయకుండా హార్టికల్చర్ అధికారులు సేకరించి కంపోస్ట్ చేసి మొక్కలకు ఉపయోగించేలా చేస్తే బాగుంటుందని కార్పొరేటర్ కొంతం దీపికకు సూచించారు. ఎంజీ రోడ్డులో కొంత మంది వ్యాపారులు కూడా ఇలాగే చేస్తున్నట్టు కార్పొరేటర్ చీర సుచిత్ర మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. మేయర్ వెం డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, బేగంపేట సర్కిల్ ఉప కమిషనర్ ముకుందరెడ్డి, కార్పొరేటర్లు చీర సుచిత్ర, కొంతం దీపిక ఉన్నారు.
బంజారాహిల్స్,మే 27: బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని రోడ్ నంబర్- 10లో చేపట్టిన సివరేజి పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తిచేసి మురుగు సమస్యలు పరిష్కరించాలని జలమండలి అధికారులను మేయర్ ఆదేశించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్బీటీనగర్ బస్తీలోని బస్తీ దవాఖానలో సేవలను మేయర్ పరిశీలించారు.
బన్సీలాల్పేట్, మే 27 : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్ దహనవాటికలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలత, నార్త్ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్రెడ్డి, బేగంపేట్ సర్కిల్ డీసీ ముకుందరెడ్డి, ఏఎంఓహెచ్ డాక్టర్ రవీందర్ గౌడ్, డిప్యూటీ ఈఈ ప్రవీణ్తో కలిసి ఆమె బన్సీలాల్పేట్లోని హిందూ శ్మశానవాటికను సందర్శించి నిర్వాహకుడు శాంతికుమార్తో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా నాన్ కొవిడ్ మృతదేహం అంత్యక్రియలకు రూ. ఆరువేలు, కొవిడ్ మృతదేహం అంత్యక్రియలకు రూ. ఎనిమిది వేలు మాత్రమే వసూలు చేయాలని సూచించారు. అనంతరం వారు అరుణ్జ్యోతి కాలనీలో ఉన్న జీహెచ్ఎంసీ విద్యుత్ దహనవాటికను సందర్శించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మేయర్ స్థానికులకు హామీ ఇచ్చారు.