సూర్యాపేట/ నూతనకల్, మే 24 : సూర్యాపేట జిల్లాలో చివరి ధాన్యం గింజను కొనుగోలు చేసేవరకు కేంద్రాలను మూసి వేయమని అదనపు కలెక్టర్ మోహన్రావు స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశాలతో జిల్లాలో వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా 6.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ఈ ధాన్యం రూ.874 కోట్ల విలువ ఉంటుందని, రైతులకు రూ.581 కోట్లు చెల్లించామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 339 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ప్రస్తుతం 155కేంద్రాలను మూసి వేసినట్లు పేర్కొన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని ఈ కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తికావడంతో బంద్ పెట్టినట్లు తెలిపారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల పరిధిలో 184కేంద్రాల ద్వారా కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయని, నెలాఖరుకు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ డీఎం రాంపతినాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నూతనకల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ కాంటాలు త్వరగా పూర్తి చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట తాసీల్దార్ జమీరుద్దీన్, ఏపీఎం కర్ణాకర్, ఏఓ మురళి ఉన్నారు.