మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
చేగుంట, మే 21 : రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల చివరి వరకు మాత్రమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని,ఆ తరువాత కొనుగోలు ఉండవని కొందరు రైతులు ఆందోళనతో తమ దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. నిన్నమొన్నటి వరకు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం అక్కడే ఉండటంతో కొంత ఇబ్బంది జరిగిందని, మంత్రి హరీశ్రావు, తాము జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామన్నారు. చేగుంట, నార్సింగి మండలాల్లో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు సరైన గోదాంలు లేక పోవడంతో ధాన్యం కేంద్రాల్లోనే ఉందన్నారు. చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్, పలువురు ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావడంతో సమస్యను పరిష్కరించామన్నారు. శుక్రవారం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలను మార్కెట్ కమిటీ గోదాంకు చేరుకున్నాయని తెలిపారు.