నల్లగొండ : సామాజిక బాధ్యత కలిగిన వాసవీ క్లబ్స్ లాంటి సంస్థలతో పాటు స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు కొవిడ్ వాలంటీర్లుగా పని చేయడానికి స్వచ్చందంగా ముందుకురావాలని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం వాసవీ క్లబ్ నల్లగొండ గ్రేటర్ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మంచికంటి నర్సయ్య స్మారకార్ధం పోలీస్ సిబ్బందికి భోజనం, వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డీఎస్పీ మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు లాక్ డౌన్ పటిష్ట అమలు కోసం పోలీస్ శాఖ కృషి చేస్తున్నదన్నారు.
అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వాసవీ క్లబ్స్ లాంటి సంస్థలు, వారి సభ్యులు కొవిడ్ వలంటీర్లుగా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ముఖ్యంగా కొవిడ్ సోకిన వ్యక్తులు ఇంట్లో, ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్న వారు ధైర్యాన్ని కోల్పోకుండా అవగాహన కల్పించాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించేలా సామాజక బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. లాక్ డౌన్ ప్రారంభం అయిన రోజు నుండి వాసవీ క్లబ్స్ అందిస్తున్న సేవలను అభినందించారు. పోలీస్ సిబ్బంది చాలా వరకు లాక్ డౌన్ అమలులో భాగంగా మధ్యాహ్నం భోజనం చేయడానికి సైతం వెళ్లలేని పరిస్థితులలో వాసవీ క్లబ్స్ అందిస్తున్న భోజన సౌకర్యం గర్వించదగ్గ విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ నల్లగొండ గ్రేటర్ అధ్యక్షుడు బాశెట్టి అశోక్ కుమార్, అసిస్టెంట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, నాయకులు కాసం శేఖర్, ఆర్. ప్రదీప్, తేలుకుంట్ల శ్రీకాంత్, సిఐలు నిగిడాల సురేష్, చంద్రశేఖర్ రెడ్ది, దుబ్బ అనీల్ కుమార్, ఎస్.ఐ.లు నర్సింహులు, రాజశేఖర్ రెడ్డి, జనగణమన ఉత్సవ సమితి సభ్యులు పోలా జనార్దన్, పోలోజు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.