మే 18(నమస్తే తెలంగాణ): కరోనా దుర్భర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతో మంది వలస కూలీలు, పేదలు ఇబ్బందులకు గురవుతున్నారు. అటువంటి వారి కోసం ‘నారీ సేన, ఉమన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్, హైదరాబాద్’ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో అమ్మలంతా కలిసి కరోనా రోగులకు ఆత్మీయ సేవలను అందిస్తున్నారు. ఫోన్ ద్వారా కోరగానే రుచికరమైన, పోషక విలువలున్న ఆహారాన్ని వారి ఇండ్లకే చేర వేస్తున్నారు.
నారీ సేన, ఉమన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 300 మందికి పైగా కరోనా రోగులకు వారి ఇంటి వద్దకు భోజనాన్ని రెండు పూటలా అందజేస్తున్నారు. ఈ సంస్థలకు చెందిన సభ్యుల ద్వారా హైదరాబాద్, బెంగళూరు, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, వైజాగ్, కాకినాడ, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో కరోనా పాజిటివ్తో హోం ఐసొలేషన్లో ఉన్నవారికి మధ్యాహ్నం, రాత్రి పూట భోజనాన్ని, మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. కరోనా సోకిన వారికి ఇంట్లో భోజనం సౌకర్యం లేకుంటే తమను 91822 25202, 9000118870, 9963425551 సంప్రదించాలని నిర్వాహకులు పేర్కొంటున్నారు.