అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయాలి

జడ్పీ స్థాయీ సంఘం సమావేశంలో జడ్పీటీసీలు
మెదక్ కలెక్టరేట్ : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయాల పోస్టులను భర్తీ చేయాలని 5వ స్థాయీ సంఘం చైర్మన్, కొల్చారం జడ్పీటీసీ మేఘమాల అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్థాయీ సంఘం సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. స్థాయీ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయ ని, టీశాట్ ద్వారా చిన్నారులతో పాటు గర్భిణులకు, బాలింతలకు పాఠాలు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని, దివ్యాంగులకు సదరం క్యాంపుతో సర్టిఫికెట్లను ఇవ్వాలన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేసే ముందు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం 6వ స్థాయీ సంఘం సమావేశంలో చైర్మన్, రామాయంపేట జడ్పీటీసీ సంధ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల్లో బెస్ట్ అవైలబుల్ పథకం కింద 5వతరగతి నుంచి 10 వరకు విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రూ. 50వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ప్రోత్సహ సాయం అందిస్తామని, ఎన్ఏసీ కింద మైనార్టీ పిల్లలకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, టేక్మాల్ జడ్పీటీసీ సరోజన, కో ఆప్షన్ సభ్యులు యూసుఫ్, మైనింగ్ ఏడీ జయరాజ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, డీడబ్ల్యూవో రసూల్ బీతో పాటు జడ్పీ సూపరింటెండెంట్ జమ్లానాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.