మేడ్చల్ రూరల్, మే 13: దళారుల బారి నుంచి రైతులను కాపాడి, మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జోరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. కేంద్రం నుంచి ధాన్యం తరలిన రెండు, మూడు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని, రైతుల బాగు కోసం సీఎం కేసీఆర్ ఎంతో చేసున్నారని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మేడ్చల్ మండల పరిధిలోని డబిల్పూర్, పూడూరు వ్యవసాయ రైతు సహకార సంఘాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం తరలివస్తున్నది. పూడూరు సహకార సంఘం పరిధిలో గోసాయిగూడ, మునీరాబాద్, పూడూరు సోమారం, రాజబొల్లారం, రాజబొల్లారం తండా, ఘనపూర్, రావల్కోల్, సైదోనిగడ్డ తండా, శామీర్పేట మండలంలోని దేవరయాంజాల్, పోతాయపల్లి గ్రామాల్లో ఉన్నాయి, డబిల్పూర్ పరిధిలో ఎల్లంపేట, డబిల్పూర్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, నూతన్కల్, శ్రీరంగవరం, బండ మాదారం, లింగాపూర్ గ్రామాలు ఉన్నాయి. రెండు సహకార సంఘాల పరిధిలోని రైతులు 8152 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలిన మూడు రోజుల్లోనే రైతులు ఖాతాల్లో నగదు జమ అవుతున్నది. పూడూరు సహకార సంఘ పరిధిలో మంగళవారం వరకు 119 మంది రైతులు 5060 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని తరలించారు. ఇందులో 50 మంది రైతులకు సంబంధించిన 2370 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.91 లక్షలు ఖాతాల్లో జమయ్యాయి. డబిల్పూర్ కేంద్రానికి 121 మంది రైతులు 3092 క్వింటాళ్ల ధాన్యాన్ని తరలించారు. ఇందులో మంగళవారం వరకు 30 మంది రైతుల ఖాతాల్లో రూ.20.39 లక్షలు జమయ్యాయి.
రైతును రాజు చేయడ మే సీఎం కేసీఆర్ లక్ష్యం. అన్నదాతలను దళారుల నుంచి కాపాడేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దత ధర చెల్లిస్తున్నారు. గతంలో రైతులు దళారులకు ధాన్యాన్ని అమ్ముకొని, క్వింటాల్కు రూ.300 నుంచి రూ.350 వరకు నష్టపోయేవారు. తరుగు కూడా ఇందుకు అదనం. ధాన్యాన్ని కేంద్రం నుంచి తరలించిన రెండు రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.-సద్ది సురేశ్రెడ్డి, చైర్మన్, డబిల్పూర్ పీఏసీఎస్
పూడూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను కాంటా పెట్టిన మూడు రోజులకే నా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి. గతంలో తిప్పి తిప్పి సంపేవారు. ప్రభు త్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రైతులకు మంచి చేసింది. నాలుగెకరాల సంబంధించి 110.80 క్వింటాళ్ల వడ్లను కాంటా పెట్టాను. నా ఖాతాల్లో రూ.2,09,190 జమయ్యాయి. -మండల లక్ష్మీనారాయణ, రైతు, రాజబొల్లారం