హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ విధించినప్పటికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతాయని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, డయాగ్నస్టిక్ సెంటర్లకు లాక్డౌన్నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు. 45 ఏండ్లు పైబడి రెండోడోసు తీసుకోవాలనుకొనేవారు మొదటిడోసు తీసుకున్నట్లు ఆధారం చూపాలని, కనీసం సెల్ఫోన్లో మెసేజ్ చూపించినా సరిపో తుందని తెలిపారు. పాక్షిక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను కొవిన్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కరోనా పరీక్షలు, టీకాలకు వెళ్లేవారికి పోలీసులు అనుమతిస్తారని తెలిపారు.