కరోనా కాలంలో అంతా ఇంటి పట్టునే ఉండటం, పైగా వేసవి కాలం కావడంతో విద్యుత్ వినియోగం అధికంగానే ఉంటుంది. కాని, పరిస్థితులు ప్రస్తుతం, అందుకు భిన్నంగా ఉన్నాయి. వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఉన్న అంచనాలు తారుమారవుతున్నాయి. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ తీవ్రత, మరోవైపు అకాల వర్షాలు… వెరసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు వారి విద్యుత్ డిమాండు ఒక్కసారిగా పడిపోయింది.సరిగ్గా గత నెల(ఏప్రిల్) 5వ తేదీన 6.1 కోట్ల యూనిట్లు (61 మిలియన్ యూనిట్లు), ఏప్రిల్ 6వ తేదీన 6.2 కోట్ల యూనిట్ల (62 మిలియన్ యూనిట్లు) విద్యుత్ వినియోగం జరిగింది. ఇక మే 1వ తేదీన రోజు వారీ విద్యుత్ డిమాండు 5.1 కోట్ల యూనిట్లు (51 మిలియన్ యూనిట్లు), మే 5వ తేదీన 5.0 కోట్ల యూనిట్లు (50 మిలియన్ యూనిట్లు)గా నమోదైంది.
అంటే నెల రోజుల వ్యవధిలో సుమారు కోటి యూనిట్లకు పడిపోయింది. కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) ఈ ఏడాది వేసవి డిమాండు మే నెలలో రోజు వారి విద్యుత్ వినియోగం 7.5 కోట్ల యూనిట్ల నుంచి 7.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. దానికి అనుగుణంగా సరఫరా చేసేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేపట్టారు. కాని, ఈ సారి విద్యుత్ డిమాండు అధికారుల అంచనాలకు అనుగుణంగా లేకుండాపోయింది. మే నెలలో అప్పుడే ఏడు రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పటికీ అకాల వర్షాలు, ఈదురు గాలుతో వాతావరణం చల్లగానే ఉంటోంది. దీంతో గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో విద్యుత్ వినియోగం సాధారణ స్థాయిలోనే ఉంటుంది.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో నగర వాసులు ఏసీలను ఎక్కువగా వాడడం లేదు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏసీ వాడకం తగ్గించాలనే ఉద్దేశ్యంతో చాలా మంది ఏసీల వైపు మొగ్గు చూడటం లేదు. దీనికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా గత రెండు మూడు వారాలు చల్లగానేది ఉంటోంది. దీంతో కూడా రోజు వారీ విద్యుత్ వినియోగం తగ్గేందుకు కారణంగా మారింది. అదే విధంగా తెలంగాణ ప్రభు త్వం రాత్రిపూట కర్ప్యూ విధించడంతో రాత్రి ఎనిమిది గంట ల నుంచి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాణిజ్య పరంగా వినియోగించే విద్యుత్ వినియోగం తగ్గుతోంది. నగరంలో వ్యాపార వాణిజ్య కేంద్రాలు సైతం పూర్తి స్థాయిలో రద్దీగా ఉండటం లేదు. కేవలం గృహ విద్యుత్ వినియోగం మాత్రమే ఉంటోందని, దీని వల్ల విద్యుత్ వినియో గం తక్కువగా ఉండి, సంస్థకు ఆదాయం తక్కువగానే వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఇవ వేసవి కాలం మరో 23 రోజులే మిగిలి ఉండడంతో విద్యుత్ వినియోగం ఈసారి తమ అంచనాలకు అనుగుణంగా ఉండదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది వేసవిలో విద్యుత్ వినియోగం మాత్రం అంచనాలకు తగ్గట్లుగా ఉండే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.