హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): జ్వరం రావడం కరోనా లక్షణాల్లో అతి ముఖ్యమైనది. వృద్ధుల్లో మాత్రం ఇది నిజం కాదని పరిశోధనల్లో తేలింది. జ్వరం రాకున్నా వారికి కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్నట్టు అమెరికా పరిశోధనల్లో వెల్లడైంది. దీనివల్ల వారి ప్రాణానికి ముప్పు ఏర్పడటమే కాకుండా, వారి ద్వారా కుటుంబసభ్యులకు కూడా కరోనా వ్యాప్తి చెందుతున్నదని తేలింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.
వృద్ధుల్లో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉంటూనే కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు తెలిపారు. కరోనా వచ్చిన వృద్ధులపై జరిపిన పరిశోధనలో 30 శాతం మందికి జ్వరం రాలేదని తేలిందని వివరించారు. చాలామందిలో ఆక్సిజన్ 90 శాతం కన్నా తక్కువున్నా శ్వాస సమస్యలు ఏర్పడలేదని, కానీ వైరస్ వ్యాప్తి జరుగుతోందని వెల్లడించారు. ముఖ్యంగా హైపోక్సియా(కణజాలానికి ఆక్సిజన్ అందడంలో సమస్యలు) సమస్య ఉన్నవారిలో కరోనాను గుర్తించటం మరీకష్టంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అందుకే వృద్ధులకు ఆరోగ్యం ఏమాత్రం తేడా అనిపించినా ఆక్సిమీటర్తో ఆక్సిజన్ స్థాయులను పరీక్షించుకోవాలని పరిశోధకులు చెప్పారు.