బన్సీలాల్పేట్, మే 4: సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో మంగళవారం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. దవాఖానలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, వార్డు బాయ్లు, అటెండర్స్, సిబ్బందికి అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలను ఎలా ఆర్పాలి? అగ్నిమాపక సామగ్రిని ఎలా వినియోగించాలి? అన్న అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఫైర్ వాటర్ వ్యాన్ ద్వారా నీటిని వెదజల్లుతూ ఐదంతస్తుల వరకు నీటిని ఎలా వినియోగించగలమో నమూనా ప్రదర్శన ద్వారా వివరించారు. ప్రమాదం జరగ్గానే రోగులు, సాధారణ ప్రజలు భయాందోళనకు గురవుతారని, అలాంటి సమయంలో వారికి ధైర్యం ఇవ్వాలని, బయటకు వెళ్ళేందుకు సరైన దారి చూపించి వారిని రక్షించే చర్యలను తీసుకోవాలని హైద్రాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో హైద్రాబాద్ జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి జీవీ ప్రసాద్, ముషీరాబాద్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర్, సెక్రెటేరియట్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ కేవీ నాగేంద్ర, గాంధీ దవాఖాన అడ్మిన్ ఏడీ నరేందర్, 50 మంది దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.