గోపాల్పూర్ జనాభా 3వేలు. పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం నెలనెలా జనాభాకు అనుగుణంగా రూ. 4.06లక్షలను జీపీ ఖాతాలో జమ చేస్తున్నది. ఈ నిధులతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా 25 విద్యుత్ స్తంభాలకు థర్డ్ వైరు లాగారు. రూ. 9లక్షలతో శ్మశాన వాటిక, రూ. 2.50లక్షలతో డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం నర్సరీలో 16 వేల మొక్కలను పెంచుతున్నారు. సుమారు 600 మీటర్ల వరకు సీసీ రోడ్లు, 400 మీటర్ల మురుగు కాల్వల నిర్మాణం, 650 మీటర్ల అంతర్గత నల్లా పైపులైన్లను పూర్తి చేశారు. గ్రామంలోని అన్ని స్తంభాలకు విద్యుత్ బల్బులతో పాటు 6 ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీ బల్బులను అమర్చారు. గ్రామ పంచాయతీ కోసం ఒకేసారి రూ. 11లక్షలు కేటాయించి ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్, సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 3300 మొక్కలు నాటి కాపాడారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఆరుగురికి నెలనెలా రూ. 8,500 చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. 8 పాత ఇండ్లు కూల్చివేయడంతో పాటు 2 బావులను పూడ్చివేశారు. నెలనెలా పల్లెప్రగతి ద్వారా వచ్చే నిధులను పాలకవర్గ సభ్యులు సక్రమంగా వినియోగించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.