మహబూబ్నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మినీ పురపోరుకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 30న పోలింగ్ ఉన్నా.. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల సంఘం ఒకరోజు ముందుగానే ప్రచారాన్ని ఆపేయాలని నిర్ణయించింది. దీంతో అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నాటికే ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్కు 72గంటల ముందే మైకులు మూగబోయాయి. ప్రచార గడువు ముగియడంతో అభ్యర్థులు పరోక్షంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఓట్లు అభ్యర్థించే పనిలో పడ్డారు. మరోవైపు ప్రచారానికి మంగళవారం సాయంత్రం తుది గడువు అయినా.. మద్యం దుకాణాలు మాత్రం బుధవారం సాయంత్రం నుంచి ఎన్నికలు ముగిసే వరకు మూయనున్నారు. ప్రచారంలో అధికార పార్టీ అభ్యర్థులు దూసుకుపోయారు. జడ్చర్లలో చివరిరోజు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రచారం చేశారు. అచ్చంపేటలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి చివరిరోజు ప్రచారంలో పాల్గొన్నారు. గడువు ముగిసినందున అభ్యర్థులెవరూ ప్రచారంలో పాల్గొనొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ప్రచారం చేస్తూ కనిపిస్తే వారిని విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నివారణ చట్టం కింద అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
జడ్చర్ల, అచ్చంపేట బల్దియాల్లో..
జడ్చర్ల పట్టణంలో 27వార్డులకు గానూ 112 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా అచ్చంపేటలో 20 వార్డులకు 66మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం 5గంటలకే ప్రచారం ముగిసింది. కొవిడ్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఒకరోజు ముందుగానే ఎన్నికల సంఘం ప్రచారాన్ని ఆపేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు ముందుగానే అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. ప్రచార గడువు ముగియడంతో పోటీ చేస్తున్న వారు, పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం కోసం బయటకొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేసేందుకు అంగీకరించబోమని చెబుతున్నారు. ప్రత్యేక నిఘా బృందాలు మున్సిపాలిటీల పరిధిలో విస్తృతంగా తిరుగుతున్నాయి. ఎవరైనా ప్రచారం చేస్తూ పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
చేసిన అభివృద్ధిని వివరిస్తూ..
ఈ నెల 22నుంచి ప్రచారం ప్రారంభం కాగా.. ఆరు రోజులపాటు అధికార పార్టీ నేతలు ప్రచారంలో దూసుకెళ్లారు. జడ్చర్ల, అచ్చంపేట పట్టణాల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. తొలిసారి జరుగుతున్న జడ్చర్ల మున్సిపల్ పోరులో అధికార టీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో మెజార్టీ కట్టబెట్టాల ని చివరిరోజు ప్రచారంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఉమ్మడి జిల్లాలోనే అభివృద్ధి చెందిన జడ్చర్లను మరింతగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. అచ్చంపేటలో ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో మాదిరిగానే తిరిగి మొత్తం 20స్థానాలను సైతం అధికార పార్టీకి వచ్చేలా ఓటర్లు తీర్పునివ్వాలని కోరారు. మరోవైపు ప్రచారం ముగిసిన తరుణంలో కౌన్సిలర్ అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ప్రచారం చేస్తూ పట్టుబడితే జైలుకే..
మంగళవారం సాయంత్రం 5గంటలకే ఎన్నికల ప్రచా రం ముగిసింది. 30వ తేదీన పోలింగ్ ఉంటుంది. అంతవరకు అభ్యర్థులెవరూ ప్రచారం చేయొద్దు. ప్రచారం చేస్తూ పట్టుబడితే విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నివారణ చట్టం కింద అరెస్టు చేస్తాం. అభ్యర్థులంతా గుర్తించాలి. మరోవైపు పోలింగ్కు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచుతాం. ప్రతి ఓటరు మాస్కు ధరించే పోలింగ్ కేంద్రానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల సిబ్బందికి కొవిడ్ కిట్ ఇస్తున్నాం.