ప్రభుత్వ కార్యాలయాలకు రావొద్దు
ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల రాకపై ఆంక్షల విధించారు. వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బూర్గుల రామకృష్ణారావు భవన్ (సచివాలయం)లోకి పాస్లను రద్దుచేశారు. సందర్శకుల ప్రవేశాన్ని పూర్తిగా కట్టడిచేశారు. సందర్శకులతో వైరస్ విజృంభిస్తున్న క్రమంలో తాజాగా వివిధ శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్లు, కలెక్టరేట్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి సామాన్యుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. కలెక్టర్ కార్యాలయాల్లో అధికారులు, వ్యక్తిగత కార్యదర్శులు కరోనా బారిన పడ్డారు. దీంతో దరఖాస్తులను, విజ్ఞప్తులను ఆన్లైన్లోనే తీసుకోవాలని, భౌతికంగా ఆఫీసుల్లోకి అనుమతించరాదని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉద్యోగులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చాలా జిల్లాల్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేశారు. ప్రజలు తమ సమస్యలను, విజ్ఞప్తులను ఆన్లైన్లో పంపితే సత్వరం పరిష్కరించడానికి కృషిచేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ మేరకు చాలా కార్యాలయాల్లో బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.